Uttar pradesh: దళిత బాలుడి మృతితో చెలరేగిన హింసాకాండ
ABN , First Publish Date - 2022-09-27T23:27:49+05:30 IST
పదిహేనేళ్ల దళిత బాలుడు మృతితో ఉత్తరప్రదేశ్లోని ఔరయా జిల్లాలో మంగళవారంనాడు హింసాకాండ..
లక్నో: పదిహేనేళ్ల దళిత బాలుడు (Dalit Boy) మృతితో ఉత్తరప్రదేశ్(Uttar pradesh)లోని ఔరయా జిల్లాలో మంగళవారంనాడు హింసాకాండ (Violence) చెలరేగింది. టీచర్ దెబ్బల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూసాడనే వార్త దావానలంలా వ్యాహించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు.
బాలుడి తండ్రి పోలీసు ఫిర్యాదు ప్రకారం, సెప్టెంబర్ 7న బాలుడు ఒక స్పెల్లింగ్ తప్పుచెప్పడంతో టీచర్ అశ్విని సింగ్ దండించాడు. అగ్రవర్ణానికి చెందిన ఆ టీచర్ బాలుడి చికిత్స కోసం తొలుత రూ.10,000 ఇచ్చాడు. ఆ తర్వాత మరో 30,000 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ కాల్కు స్పందించడం మానేశాడు. తాను గట్టిగా నిలిదీయడంతో కులం పేరుతో దూషించినట్టు బాలుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయాలతో బాలుడు గత సోమవారం కన్నుమూయడంతో, టీచర్ను అరెస్టు చేయాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అంతవరకూ పిల్లవాడి అంత్యక్రియలు చేసేది లేదని పట్టుబట్టారు. కాగా, సోమవారం రాత్రి భీమ్ ఆర్మీ కార్యకర్తలు స్కూలు వెలుపల నిరసనలకు దిగారు. నిరసనలు కాస్తా ఆందోళనగా మారడంతో రెచ్చిపోయిన జనం ఒక పోలీసు జీపునకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు నచ్చచెప్పి టీచర్ను అరెస్టు చేస్తామని చెప్పడంతో బాలుని మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లారు. బీమ్ ఆర్మీ కేవలం నిరసనలు తెలిపిందనీ, కొందరు అల్లరిమూక హింసకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలుడి మృతిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఅర్ నమోదు చేసినట్టు చెప్పారు. పరారీలో ఉన్న టీచర్ కోసం అన్వేషిస్తున్నారు.