Virat Kohli: టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2021-09-16T23:54:27+05:30 IST
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబరు-నవంబరు మధ్య జరగనున్న
న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబరు-నవంబరు మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్బై చెప్పనున్నట్టు సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించి అభిమానులను విస్మయ పరిచాడు. అయితే, టెస్టు, వన్డే జట్లకు మాత్రం కెప్టెన్గా వ్యవహరిస్తానని చెప్పడం గమనార్హం.
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మ తదితర సహచర ఆటగాళ్లతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాకు కూడా ఈ విషయమై సమాచారం అందించినట్టు పేర్కొన్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి పని ఒత్తిడే కారణమని తెలిపాడు. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనుండడంతో తదుపరి సారథి ఎవరన్న దానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ విషయంలో రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.