ధోనీకి బిగ్ థ్యాంక్స్ చెప్పిన విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2022-01-17T03:02:29+05:30 IST

కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో భారత జట్టు ఓటమి తర్వాత సారథి విరాట్ కోహ్లీ తీసుకున్న..

ధోనీకి బిగ్ థ్యాంక్స్ చెప్పిన విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో భారత జట్టు ఓటమి తర్వాత సారథి విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం దేశంలోని క్రికెట్ అభిమానులనే కాదు, యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. టెస్టు కెప్టెన్సీ నుంచి తాను తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.


మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలా కోహ్లీ సిరీస్ మధ్యలో ఈ ప్రకటన చేయలేదు. సిరీస్ ముగిశాక అకస్మాత్తుగా చేశాడు. కోహ్లీ ఈ సందర్భంగా బీసీసీఐ, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. 


దేశానికి నాయకత్వం వహించే అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పిన కోహ్లీ.. కుర్రాళ్లు తన జర్నీని మర్చిపోలేని అందమైన జ్ఞాపకంగా మిగిల్చారని పేర్కొన్నాడు. రవిభాయ్ (రవిశాస్త్రి), సపోర్ట్ టీమ్ తమ జట్టుకు ఇంజిన్‌లా మారి ముందుకు నడిపించారని అన్నాడు. వారంతా కలిసి ఓ గొప్ప పాత్ర పోషించారని కొనియాడాడు.


చివర్లో ధోనీ గురించి చెబుతూ.. తనలోని నాయకత్వ నైపుణ్యాన్ని ధోనీ గుర్తించాడని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపాడు. ‘‘ధోనీ నీకు బిగ్ థ్యాంక్స్. ఇండియన్ క్రికెట్‌ను కెప్టెన్‌గా ముందుకు నడిపించగలనని విశ్వసించావు’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 


Updated Date - 2022-01-17T03:02:29+05:30 IST