పీపుల్‌ కార్డ్స్‌ పేరుతో భారత్‌లో గూగుల్‌ కొత్త ఫీచర్‌

ABN , First Publish Date - 2020-08-12T13:52:40+05:30 IST

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో విజిటింగ్‌ కార్డులకు పోటీగా డిజిటల్‌ విజిటింగ్‌ కార్డులు కూడా పుట్టుకొచ్చాయి.

పీపుల్‌ కార్డ్స్‌ పేరుతో భారత్‌లో గూగుల్‌ కొత్త ఫీచర్‌

గూగుల్‌ నుంచి వర్చువల్‌ విజిటింగ్‌ కార్డ్స్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో విజిటింగ్‌ కార్డులకు పోటీగా డిజిటల్‌ విజిటింగ్‌ కార్డులు కూడా పుట్టుకొచ్చాయి. ‘పీపుల్‌ కార్డ్స్‌’ పేరుతో మంగళవారం గూగుల్‌ వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా ఏళ్లుగా టెస్టింగ్‌లో ఉన్న ఫీచర్‌ను మొట్టమొదటిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టారు. దీని సహాయంతో ఎవరైనా ఆన్‌లైన్‌లో వర్చువల్‌ విజిటింగ్‌ కార్డును సృష్టించుకోవచ్చు.


సామాన్య ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారు.. ఇలా పలువురికి ఉపయోగపడేలా ఈ సదుపాయాన్ని రూపొందించారు. ఈ కార్డులో వారి వైబ్‌సైట్‌ లేదా సోషల్‌ మీడియా ప్రొఫైల్‌తో పాటు ఇతర వివరాలను పొందుపరచుకోవచ్చు. నెటిజన్లు తమ మొబైల్‌ ఫోన్‌ నుండి పీపుల్‌ కార్డ్స్‌ను శోధించవచ్చు. వినియోగదారుడు గూగుల్‌లో ఎవరి పేరైనా సెర్చ్‌ చేసినపుడు, ఆ పేరుతో ఉన్న కార్డ్స్‌ అన్నీ కనిపిస్తాయి. మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి ‘యాడ్‌ మీ టు సెర్చ్‌’ అని టైప్‌ చేయడం ద్వారా ఈ కార్డును ఎవరైనా క్రియేట్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2020-08-12T13:52:40+05:30 IST