వైరస్‌ తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-02-04T05:26:14+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గత నెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన జ్వర సర్వేలో 4 వేల మందికి పైగా కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని గుర్తించి ఇంటి వద్దనే మందుల కిట్లను అందించడంతో జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులకు అడ్డుకట్ట వేసినట్లు అయింది.

వైరస్‌ తగ్గుముఖం
సర్వే నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది

- జిల్లాలో తగ్గుతున్న కరోనా కేసులు

- 200 నుంచి 100కు పడిపోయిన పాజిటివ్‌ కేసులు

- ఇంటింటా జ్వర సర్వేతో నియంత్రణ

- రెండు విడతలుగా చేపట్టిన ఫీవర్‌ సర్వే

- ఫీవర్‌ సర్వేతో 4 వేల మందికి పైగా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తింపు

- థర్డ్‌వేవ్‌లో కరోనా వచ్చినా అంత తీవ్రత లేదని చెబుతున్న వైద్యులు


కామారెడ్డి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గత నెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన జ్వర సర్వేలో 4 వేల మందికి పైగా కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని గుర్తించి ఇంటి వద్దనే మందుల కిట్లను అందించడంతో జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులకు అడ్డుకట్ట వేసినట్లు అయింది. ఇంటింటి జ్వర సర్వేను గత నెల 21 నుంచి జిల్లాలో ప్రారంభించిన రోజుల్లో 200 మందికి పైగానే పాజిటివ్‌ కేసులు అవుతూ వచ్చాయి. దీంతో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ వైద్యఆరోగ్యశాఖను అప్రమత్తం చేసి ఇంటింటా ఫీవర్‌ సర్వేను నిర్వహించారు. మొత్తం 856 సర్వే బృందాలతో గ్రామాలు, పట్టణాల్లో వేగవంతం చేసి దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పు ఉన్న వారిని గుర్తించి మందుల కిట్లు అందజేశారు. ఓ వైపు కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతునే ఇంటింటికీ వెళ్లి మందులు ఇవ్వడంతో కరోనాను ఎక్కడికక్కడే కట్టడి చేశారు.

ఫలించిన ఇంటింటి ఫీవర్‌ సర్వే

జిల్లాలో డిసెంబరు నెల నుంచి కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. జనవరిలో కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజూ 200లకు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి ఫీవర్‌ సర్వేను చేపట్టారు. జిల్లాలో వారం రోజుల పాటు ఈ ఫీవర్‌ సర్వేను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా 2లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఫీవర్‌ సర్వే కోసం 856 వైద్యఆరోగ్యశాఖ బృందాలను ఏర్పాటు చేసి గ్రామగ్రామాన పట్టణాల్లోని ప్రతీ వార్డును జల్లెడ పట్టారు. వారంరోజుల పాటు 856 సర్వే బృందాలు 2,70,117 ఇళ్లలో సర్వే చేశారు. 4 వేల 882 మందికి దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి కరోనా మందుల కిట్లు అందజేసి హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు.

వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

జిల్లాలో కరోనా థర్డ్‌వేవ్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. జనవరి నెలలో ప్రతి రోజూ 200లకు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వంద వరకే కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి 2న 109 కేసులు నమోదు కాగా 1న 95 కేసులు, జనవరి 31న 111 కేసులు, 30న 29 కేసులు, 29న 139 కేసులు, జనవరి 28న 207 కేసులు, జనవరి 27న 150 కేసులు, జనవరి 26న 32 కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించడంతోనే వైరస్‌ భారిన పడిన వారిని వెంటనే గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచడంతోనే కేసులు తగ్గుముఖం పట్టినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ముప్పు తక్కువే..

కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా అవుతున్నప్పటికీ ముప్పు మాత్రం తక్కువగానే ఉంటూ వచ్చింది. జనవరిలో క్రమంగా పాజిటివ్‌ రేటు పెరుగుతూ వచ్చింది. చాలా మంది కరోనా బాధితుల్లో సాధారణ లక్షణాలే కనిపించడం ఊరట కల్పించింది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులే ప్రధానంగా ఉంటూ వచ్చాయి. పాజిటివ్‌ వచ్చిన వారు వారం రోజుల లోపు కోలుకున్నారు. కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. కానీ థర్డ్‌వేవ్‌లో చాలా మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరే తీవ్ర పరిస్థితి రాలేదు. జిల్లాలో రోజుకు సగటున 2 వేలకు పైగా అనుమానితులు కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ 200లకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తూ వచ్చాయి. కానీ వీరేవరు ఆసుపత్రుల్లో చేరిన దాఖలాలు లేవు. ఇంటి వద్దే ఉండి మందులు వాడడంతో వారం రోజుల్లో కోలుకున్నారు. థర్డ్‌వేవ్‌లో వైరస్‌ చాలా వ రకు బలహీన పడిందని వైరస్‌ సోకిన వారిలో అంత ప్రభావం కనిపించలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వ్యాక్సిన్‌ తీసుకోవడం, రోగనిరోధకశక్తి పెంచుకోవడంతోనే థర్డ్‌వేవ్‌లో వైరస్‌ను తట్టుకునే స్థాయి వచ్చిందని వైద్యులు పేర్కొంటున్నారు.

జాగ్రత్తలు పాటించకుంటే మళ్లీ విజృంభణే

జనవరిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు జిల్లాలో 200లకు పైగానే నమోదయ్యాయి. ఇంటింటా జ్వర సర్వే పాజిటివ్‌ కేసులను ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో ప్రస్తుతం 109కి పడిపోయింది. ప్రస్తుతం జిల్లాలో కొవిడ్‌ కట్టడికి వైద్యఆరోగ్యశాఖ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గుతున్నాయనే ఆలోచనతో చాలా మంది మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి తోడు శుభాకార్యాల ముమూర్తాలు ప్రారంభమైనందున పెళ్లిలు, ఇతర శుభ కార్యక్రమాలు ఉన్న సమయంలో జాగ్రత్తలు పాటించకుంటే వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది మార్కెట్‌లలో గుంపులు గుంపులుగానే తిరుగుతున్నారు.

Updated Date - 2022-02-04T05:26:14+05:30 IST