Visa renewal: ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న.. 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-08-10T15:50:26+05:30 IST

హైస్కూల్ డిగ్రీ లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగి ఉండి, 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు కువైత్ సర్కార్ ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Visa renewal: ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న.. 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్!

కువైత్ సిటీ: హైస్కూల్ డిగ్రీ లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగి ఉండి, 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు కువైత్ సర్కార్ ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనికోసం ఏడాదికి 2వేల కువైటీ దినార్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కువైత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలామంది నుంచి వ్యతిరేకత వచ్చింది. ఉపాధి కోసం వచ్చిన వారి వద్ద నుంచి వీసా రెన్యువల్ రూపంలో ఇంత భారీ మొత్తం వసూలు చేయడం సమంజసం కాదనేది వారి అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే చాలామంది ప్రవాసులు ఏడాదికి 2వేల దినార్లు సంపాదించడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తాజాగా కువైత్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ప్రవాసులకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. 


దీంతో 65 ఏళ్లకు పైబడిన సుమారు 1,800 మంది ప్రవాసులకు(సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం) లబ్ధి చేకూరనుంది. ఇక కువైత్ వ్యాప్తంగా దాదాపు 86వేల మంది ప్రవాసులపై ఈ భారీ ఫీజు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే.. 65 ఏళ్లు దాటిన ప్రవాసులు డిగ్రీ అంతకంటే తక్కువ విద్యార్హత ఉంటే వారి రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ చేయబోమని, వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లాలని కువైత్ మొదట వెళ్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో కువైత్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ ఫీజును భారీగా పెంచేసింది. అంటే ప్రవాసులకు పొమ్మనలేక పొగ బెట్టిందన్నమాట. కువైటైజేషన్‌లో భాగంగానే ఆ దేశం ఇలా కఠిన నిర్ణయం తీసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Updated Date - 2021-08-10T15:50:26+05:30 IST