‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం
ABN , First Publish Date - 2022-01-24T02:01:58+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది.
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి రానున్న నెల రోజుల్లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివిధ కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. ఆదివారం విశాఖ పౌరగ్రంథాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ చైర్మన్ నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటంలో భాగంగా జనవరి 26న గుంటూరు, 27వ తేదీన తిరుపతిలో సభలను నిర్వహించనున్నట్టు చెప్పారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయని నరసింగరావు తెలిపారు.