విశాఖలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-08-11T13:25:34+05:30 IST
విశాఖలోని దొండపర్తి జంక్షన్లో ఉన్న కేఎస్ఆర్ కాంప్లెక్స్ భవనం సెల్లార్లో అగ్నిప్రమాదం సంభవించింది.
విశాఖపట్నం: విశాఖలోని దొండపర్తి జంక్షన్లో ఉన్న కేఎస్ఆర్ కాంప్లెక్స్ భవనం సెల్లార్లో అగ్నిప్రమాదం సంభవించింది. గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో సెల్లార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సెల్లార్లో నిల్వ ఉంచిన ఫర్నిచర్, వేస్ట్ ఫర్నిచర్ మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని అర్ధరాత్రి నుంచి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగలు మాత్రం ఇంకా వస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహకారంతో ఫర్నిచర్ దుకాణాల నుంచి మొత్తం ఫర్నిచర్ను బయటికి తీసి రోడ్డుపై ఉంచారు. భవనం మొదటి అంతస్తులో వెంకటేశ్వర ఫర్నిచర్, పూజా ఫర్నిచర్, రామ్ ఫర్నిచర్తో పాటు పలు ఫర్నీచర్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలకు సంబంధించిన ఫర్నిచర్తో పాటు వేస్ట్ ఫర్నిచర్ కూడా సెల్లార్లో ఉంచారు. ప్రమాదంలో ఫర్నీచర్ అగ్నికి ఆహుతవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.