విశాఖలో మళ్లీ కలకలం

ABN , First Publish Date - 2020-05-22T14:09:51+05:30 IST

విశాఖలో ఎక్కడైనా దట్టమైన పొగలు కనిపిస్తే చాలు జనం బెంబేలెత్తిపోతున్నారు..

విశాఖలో మళ్లీ కలకలం

హెచ్‌పీసీఎల్‌ నుంచి దట్టమైన పొగలు

పరుగులు తీసిన పరిసర ప్రాంతాల ప్రజలు

ఎఫ్‌సీసీ యూనిట్‌ నుంచి ఫ్లూ గ్యాస్‌ లీక్‌..

అప్రమత్తమైన యాజమాన్యం 


విశాఖపట్నం/మల్కాపురం: విశాఖలో ఎక్కడైనా దట్టమైన పొగలు కనిపిస్తే చాలు జనం బెంబేలెత్తిపోతున్నారు. రెండు వారాల క్రితం ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన మరువకముందే.. తాజాగా మరోసారి కలకలం రేగింది. గతంలో అనేక ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిన మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 3.10 గంటలకు దట్టమైన పొగలు వెలువడ్డాయి. 20 నిమిషాల పాటు ఆకాశాన్ని దట్టంగా కమ్మేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ‘కంపెనీలో ఏదో ప్రమాదం జరిగినట్టుంది, ప్రాణాలు దక్కించుకోండి...’ అంటూ అరుస్తూ తలో దిక్కు పారిపోయారు. కంపెనీ చిమ్నీ నుంచి వెలువడిన పొగ పసుపు రంగులో ఉండడం, గతంలో ఎప్పుడూ ఇలాంటి పొగ రాకపోవడంతో జనం బెంబేలెత్తారు. అయితే ఆ పొగ నుంచి ఎలాంటి వాసన లేకపోవడంతో, దాని ప్రభావం కూడా ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  


అసలేం జరిగింది?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హెచ్‌పీసీఎల్‌లో 40 రోజుల నుంచి క్రూడాయిల్‌ రిఫైనింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. నామమత్రంగా కొన్ని విభాగాలే నిర్వహణ నిమిత్తం నడుస్తున్నాయి. పది రోజులుగా ఒక్కొక్క యూనిట్‌ను పునఃప్రారంభం చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థలో ప్లూయిడైజ్డ్‌ కేటలిటిక్‌ క్రాకింగ్‌ యూనిట్‌ (ఎఫ్‌సీసీయూ)ను గురువారం ప్రారంభించారు. కొద్దిసేపటికే దానికి సంబంధించిన పైప్‌లైన్‌లో సాంకేతిక లోపం ఏర్పాడి చిమ్నీ నుంచి పసుపు రంగులో దట్టమైన పొగలు బయటకొచ్చాయి. వాటిని చూసి సమీపంలోని రామ్‌నగర్‌, గుల్లలపాలెం, శ్రీనివాసనగర్‌, కోడిపందెల దిబ్బ పరిసర ప్రాంతాల ప్రజలు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే మల్కాపురం సీఐ ఉదయ్‌కుమార్‌ కంపెనీకి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హెచ్‌పీసీఎల్‌ అధికారులు దీనిపై ఒక ప్రకటన విడుదల చేస్తూ, బయటకు వెలువడింది.. ఆవిరితో కూడిన ఫ్లూ గ్యాస్‌ అని, దానిని నాలుగు నిమిషాల్లోనే నియంత్రించామని, ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారు.


Updated Date - 2020-05-22T14:09:51+05:30 IST