బ్రహ్మోత్సవ కళ.. హనుమంత వాహనంపై వేంకటేశుడు
ABN , First Publish Date - 2020-09-20T17:53:09+05:30 IST
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ప్రారంభమైన రోజునే..
గంటస్తంభం (విజయనగరం): బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ప్రారంభమైన రోజునే విజయనగరంలోని రింగురోడ్డు వేంకటేశ్వర స్వామి ఆలయంలోనూ శనివారం మొదలయ్యాయి. ఉదయాన్నే స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మండపరాధన పూర్తి చేసి ఉత్సవ విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఉత్సవాల ప్రారంభానికి సూచికగా ధ్వజారోహణం చేశారు. హనుమంత వాహనంపై స్వామిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. సాయంత్రం ఊంజల్ సేవలో కొద్దిమంది భక్తులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 28 వరకూ ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పిళ్లా విజయ్కుమార్, కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ పర్యవేక్షణలో పూజా క్రతువులు జరుగనున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాన అర్చకులు పీసపాటి వెంకట నర్సింహశాస్త్రి, శ్రీమన్నారాయణ తెలిపారు.
రామతీర్థంలో...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోనూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారికి తిరువీధులు నిర్వహించారు. ప్రఽధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు మా ట్లాడుతూ ప్రతిరోజు గ్రామ బలిహరణ, తిరువీధి నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాలను సాయిరామాచార్యులతో పాటు అర్చకులు కిరణ్కుమార్, గొడవర్తినరసింహాచార్యులు, పవన్కుమార్, ప్రసాద్ తదితరులు నిర్వహించారు. ఈవో కిషోర్కుమార్ పర్యవేక్షించారు.