కరుణానిధే మెచ్చుకున్నారు

ABN , First Publish Date - 2021-07-19T16:48:08+05:30 IST

తన వివాహవేడుకల్లో పాల్గొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనను ధీరవనితనంటూ మెచ్చుకున్నారని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ తెలిపారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో శశికళ తన కుటుంబం...

కరుణానిధే మెచ్చుకున్నారు

డాక్టర్‌గా సేవ చేయాలనుకున్నా

జయను జాగ్రత్తగా చూసుకోమని ఎంజీఆరే చెప్పారు

ఆయన భౌతికకాయం వద్దకు మమ్మల్ని రానీయలేదు

గేటు పగులగొట్టుకుని వెళ్లాలని జయ కారు డ్రైవర్‌కు చెప్పారు

టీవీ ఇంటర్వ్యూలో శశికళ


చెన్నై: తన వివాహవేడుకల్లో పాల్గొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనను ధీరవనితనంటూ మెచ్చుకున్నారని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ తెలిపారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో శశికళ తన కుటుంబం గురించి, జయతో ఏర్పడిన పరిచయం గురించి, తన వివాహ వేడుకల్లో కరుణానిధి పాల్గొనటం తదితర అంశాలు వివరించారు. తమ కుటుంబం చాలా పెద్దదని, తండ్రి తోబుట్టువులు కలిపి మొత్తం 11 మంది దాకా ఉన్నారని, 46 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారని చెప్పారు. తాను డాక్టర్‌ కావాలనుకున్నానని, తమ కుటుంబీకులు అమ్మాయిలకు పిన్న వయస్సులోనే పెళ్ళిళ్లు చేస్తారని, తనకు కూడా పిన్నవయస్సులో పెళ్ళి జరి గిందంటూ.. ఆ కారణంగానే డాక్టర్‌ కావాలనే తన కోరిక నెరవేరలేదని శశికళ వాపోయారు. నటరాజన్‌తో జరిగిన వివాహం గురించి ప్రస్తావిస్తూ... పెళ్ళి నిశ్చితార్థం తర్వాతే ఆయన డీఎంకేకు చెందినవారని తెలిసిందని చెప్పారు. 1973 సెప్టెంబర్‌ 16న తంజావూరులోని కాంతై తమిళ్‌సంఘం హాలులో తమ వివాహం జరిగిందని, ఆ వేడుకకు వచ్చిన కరుణానిధి.. ‘పెళ్ళికూతురు తలెత్తుకుని ఠీవీగా కూర్చుందే’ అంటూ అందరినీ నవ్విం చారని గుర్తు చేసుకున్నారు. వేదికపై కరుణానిధి ప్రసంగిస్తూ వధువు ధీరవనితలా ఉందని, మహిళలందరూ ఇలాగే వుండాలని ప్రశంసించారని తెలిపారు. 


జయతో తొలిపరిచయం... 

1981 డిసెంబర్‌లో ప్రపంచ తమిళ మహానాడులో జయలలిత పాల్గొన్న కార్యక్రమాలకు తన పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ జరిగిందని, ఆ వీడియోలు చూసి ఆమె మెచ్చుకున్నారని శశికళ తెలిపారు. ఆ తర్వాత కన్ని యాకుమారిలో జయ చేసిన ప్రసంగం వివాదాస్పదం కావడంతో ఆ సభ కార్యక్రమాలను తీసిన వీడియో కోసం డీఎంకే నేతలు తీవ్రంగా ప్రయత్నించారని, కానీ తాను ఆ వీడియోను పార్టీ ప్రముఖుడి ద్వారా జయకు చేర్చానన్నారు. ఆ సంఘటన తర్వాతే జయ నుంచి పిలుపు వచ్చిందని వివ రించారు. ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆమెను కలుసుకు న్నానని, ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు రాసిన లేఖలను చదువుతున్నా రని పేర్కొన్నారు. అప్పటి నుంచి తమిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయని చెప్పారు. మొదటి నుంచి తాను జయను ‘అక్కా’ అనే పిలుస్తున్నానని తెలిపారు. జయ నగరంలోని పలు ప్రాంతాలను ఒంట రిగా సందర్శించేందుకు ఆశపడ్డారని, ఆ మేరకు తామిద్దరం కలసి ఓ రోజు ఉదయం కారులో తిరువాన్మియూరు దాటి ఈస్ట్‌కోస్‌ రోడ్డు వరకు వెళ్ళామని, కారును రోడ్డు పక్క నే నిలబెట్టి ఇరువురం పెద్ద చేతి రుమాళ్లను కట్టుకుని రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు వాకింగ్‌ చేశామన్నారు. తన గురించి జయే ఎంజీఆర్‌కు తెలిపారని, ఆయనోసారి తనను కలిసి ‘అమ్ము’ (జయను ఎంజీఆర్‌ అలాగే పిలిచేవారు)ను జాగ్రతగా చూసుకోండి అంటూ చెప్పారని శశికళ తెలిపారు.


1987లో పోయెస్‌గార్డెన్‌లోకి...

ఎంజీఆర్‌ మృతి చెందిన రోజే తాను జయను పోయెస్‌గార్డెన్‌లో కలుసు కున్నానని శశికళ తెలిపారు. ఎంజీఆర్‌ చనిపోయిన విషయాన్ని జయకు ఎవరూ చెప్పలేదని, తానే ఫోన్‌ చేసి చెప్పగానే దిగ్ర్భాంతి చెందారని, ఆ రోజంతా విరక్తిగా గడిపారని తెలిపారు. జయ, తాను కారులో ఎంజీఆర్‌ భౌతికకాయం ఉంచిన రామావరం గార్డెన్‌కు వెళ్ళినప్పుడు ఎవరూ తమను లోపలకు అనుమతించలేదని, గేటును మూసివేశారని చెప్పారు. ఆ సమయంలో జయ ఆ గేటును పగులగొట్టుకుని వెళ్లాలని డ్రైవర్‌ను ఆదే శించారని, తమ కారు వేగంగా రివర్స్‌ వెళ్ళటం గమనించి సిబ్బంది గేటును తెరిచారని తెలిపారు. ఆ సమయంలో అక్కడ మాజీ మంత్రి రాజారామ్‌ తోపాటు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా వున్నారని, తమను చూడగానే ‘వారిని లోపలకు అనుమతించండి’ అంటూ రజనీ చెప్పారని వివరించారు. రజనీని చూడటం అదే మొదటిసారి అని శశికళ చెప్పారు.

Updated Date - 2021-07-19T16:48:08+05:30 IST