వొడాఫోన్ ఐడియాను ఇక భరించలేం..
ABN , First Publish Date - 2021-08-03T05:54:51+05:30 IST
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాను భరించడం ఇక తమ వల్ల కాదని ఆదిత్య
వాటా ఇచ్చేందుకు రెడీ
ఆదిత్య బిర్లా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా
న్యూఢిల్లీ : పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాను భరించడం ఇక తమ వల్ల కాదని ఆదిత్య బిర్లా గ్రూప్ స్పష్టం చేసింది. ఈ కంపెనీ ఈక్విటీలో తమకు ఉన్న 27 శాతం వాటాను ప్రభుత్వం లేదా ప్రభుత్వం సూచించే ఎవరికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఈ ఏడాది జూన్ 7న కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు.
అయితే ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఇంకా వెల్లడి కాలేదు. వొడాఫోన్ ఐడియా మూతపడకుండా కొనసాగాలన్నదే తమ ఉద్దేశమని బిర్లా ఆ లేఖలో పేర్కొన్నారు. రూ.25,000 కోట్ల నిధుల సేకరణకు వొడాఫోన్ ఐడియా బోర్డు గత ఏడాది సెప్టెంబరులోనే ఆమోదం తెలిపింది. అయినా ఇప్పటి వరకు ఒక్క రుణ దాత కూడా ముందుకు రాని విషయాన్ని బిర్లా తన లేఖలో ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ నష్టాల కంపెనీలో పెట్టుబడులు ఇక తమ వల్ల కాదని వొడాఫోన్ గ్రూప్ ఇప్పటికే చేతులెత్తేసింది.