‘ఒమైక్రాన్‌’ నిరోధానికి చర్యలు

ABN , First Publish Date - 2021-12-03T15:43:35+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమైక్రాన్‌ కేసు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. దక్షిణాఫ్రికాలో కొత్తగా నమోదైన ఒమైక్రాన్‌ వైరస్‌ను అడ్డుకొనేలా దేశ వ్యాప్తంగా పలు చర్యలు చేపట్టిన కేంద్రప్రభుత్వం,

‘ఒమైక్రాన్‌’ నిరోధానికి చర్యలు

                    - Health minister ఎం. సుబ్రమణ్యం


చెన్నై: రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమైక్రాన్‌ కేసు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. దక్షిణాఫ్రికాలో కొత్తగా నమోదైన ఒమైక్రాన్‌ వైరస్‌ను అడ్డుకొనేలా దేశ వ్యాప్తంగా పలు చర్యలు చేపట్టిన కేంద్రప్రభుత్వం, అన్ని రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఈ క్రమంలో, మదురై విమానాశ్రయంలో ఒమైక్రాన్‌ నిరోధక చర్యలను గురువారం పరిశీలించిన మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ, విదేశాల నుంచి  వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, 100 డిగ్రీలు జ్వరం కలిగిన వారి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని తెలిపారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు తరలించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో, ఒమైక్రాన్‌ లక్షణాలు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. అదే సమయంలో అర్హులైన వారందరూ కరోనా టీకాలు సత్వరం వేసుకోవాలని మంత్రి సూచించారు.


జీహెచ్‌లో 150 పడకలతో ఒమైక్రాన్‌ ప్రత్యేక వార్డు

 ఒమైక్రాన్‌ ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో 150 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలు తాజాగా మరో ప్రమాదకర మైన వైరస్‌ వెలుగు చూడడంతో ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కరోనా కంటే ఒమైక్రాన్‌తో అధిక ప్రమాదం వాటిల్లే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఒమైక్రాన్‌ వైరస్‌ను అడ్డుకొనేలా ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-03T15:43:35+05:30 IST