ఖుష్బూకి ఓటేయండి: సీఎం పళనిస్వామి
ABN , First Publish Date - 2021-03-30T02:23:17+05:30 IST
ఖుష్బూ తౌసాండ్స్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. పళనిస్వామి ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు
చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరంటారు. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు నేడు శత్రువులు అవుతుంటారు, నిన్నటి వరకు శత్రువులుగా ఉన్నవారు ఉన్నపళంగా మిత్రులు అవుతుంటారు. తమిళనాడులో అలాంటి పరిస్థితే వచ్చింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖష్బూ, డీఎంకేతో మిత్రుత్వం అన్నాడీఎంకేతో శత్రుత్వం నెరిపారు. అయితే ఆమె బీజేపీలో చేరగానే అన్నాడీఎంకేతో మిత్రుత్వం, డీఎంకేతో శత్రుత్వం పెరిగిపోయింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆమెకు అన్నాడీఎంకే నేత, సీఎం పళనిస్వామి ఎదురుపడ్డారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పొగడ్తలు కురిపించుకున్నారు. ఈ సందర్భంగా పళనిస్వామి స్పందిస్తూ ‘‘ఆమెకు (ఖుష్బూ) ఓటేయండి. మీ సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి పరిష్కరిస్తారు’’ అంటూ ఓటర్లను అర్జించారు. మంచి పాలనకు ఆమెకు ప్రయత్నిస్తారని, కేంద్రంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దేశంలోని ప్రజలందరికీ తొందరలోనే ఉచితంగా కోవిడ్ టీకా వేస్తామని అన్న ప్రధాని మాటలను పళని గుర్తు చేశారు.
ఖుష్బూ తౌసాండ్స్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. పళనిస్వామి ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 6న జరగనుంది. లెక్కింపు మే 2న నిర్వహించనున్నారు.