బెంగాల్, అస్సాంలతో పోల్చుకుంటే వెనకబడ్డ తమిళనాడు, కేరళ
ABN , First Publish Date - 2021-04-07T01:05:11+05:30 IST
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఒకేసారి జరిగింది. ఈ ప్రాంతంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ఇదొక కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ముగిసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. అస్సాంలో చివరి దశ, పశ్చిమ బెంగాల్లో మూడవ దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాగా ఎప్పటిలాగే అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైంది. నేటితో కలిపి మూడు రౌండ్ల పోలింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ నుంచి రికార్డు స్థాయిలో ఈ రాష్ట్రాలు ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకుంటున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తక్కువ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఒకేసారి జరిగింది. ఈ ప్రాంతంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ఇదొక కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈశాన్య భారతంలో పోటెత్తినంతగా దక్షిణ భారతంలోని ఓటర్లు చొరవ చూపలేదు.
ఎన్నికల సంఘం అధికారిక లెక్కవ ప్రకారం.. సాయంత్రం 7 గంటల వరకు వివిధ అసెంబ్లీల పరిధిలో నమోదైన ఓటింగ్ శాతం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- అస్సాం: 82.29 శాతం
- పశ్చిమ బెంగాల్: 77.68 శాతం
- కేరళ: 70.04 శాతం
- తమిళనాడు: 65.11 శాతం
- పుదుచ్చేరి: 78.13 శాతం