మంత్రి అప్పలరాజును బర్తరఫ్ చేయాలి
ABN , First Publish Date - 2021-12-05T05:56:19+05:30 IST
వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును బర్తరఫ్ చేయాలని మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు నిడమర్తి కేశవమూర్తి డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న వీఆర్వోల నిరసనలు
సీఐటీయూ మద్దతు
గణపవరం, డిసెంబరు 4: వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును బర్తరఫ్ చేయాలని మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు నిడమర్తి కేశవమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్వోలకు రక్షణ కల్పిస్తామని సీఎం హామీ ఇస్తేనే గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శనివారం గణపవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సచివాలయాల్లో విధులను బహిష్కరించిన వీఆర్వోలు తహసీల్దార్ కార్యాల యంలోనే శనివారం కూడా విధులను నిర్వహించారు. సంఘం కార్యదర్శి శ్రీకాంత్ బాబు, కోశాధికారి అనూష, వీఆర్వోలు వేణు గోపాల్, ఆకుల రాజేంద్ర ప్రసాద్ బాబు, చంద్రశేఖర్, అడబాల రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉండ్రాజవరం: వీఆర్వోల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు, కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీఐటీయు నాయకులు తూరుగోపు వెంకటేశ్వరరావు, గుండుమేను జగన్నాథం డిమాండ్ చేశారు. శనివారం వారు ఉండ్రాజవరంలో వీఆర్వోల నిరసనకు మద్దతు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తమ వంతు కృషి చేస్తున్న వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. పలువురు వీఆర్వోలు పాల్గొన్నారు.
పెంటపాడు: మంత్రి అప్పలరాజు వీఆర్వోలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మండల వీఆర్వోలు డిమాండ్ చేశారు. శనివారం పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోని పక్షంలో నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు పి. కృష్ణస్వామి, కార్యదర్శి జి. రామచంద్రరావు, సభ్యులు సీహెచ్. శ్రీనివాసరావు, కె. నాగేశ్వరరావు, ఎన్.రామకృష్ణ, ఎస్.కనకదుర్గ, ఆర్.కుమారి తదితరులు పాల్గొన్నారు.