మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై వీఆర్వోల నిరసన

ABN , First Publish Date - 2021-12-03T04:55:47+05:30 IST

వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిరసన వెల్లువెత్తింది.

మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై వీఆర్వోల నిరసన
దేవరపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న వీఆర్వోలు

దేవరపల్లి, డిసెంబరు 2: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిరసన వెల్లువెత్తింది. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం వీఆర్వోలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ రామకృష్ణకు అందజేశారు. అప్పలరాజు తక్షణమే వీఆర్వోలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. వీఆర్వోలకు పని ఒత్తిడి ఎక్కువైందన్నారు. అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలందరూ పాల్గొన్నారు. 


గోపాలపురం: రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధు లకు ఐదేళ్ల పదవీ కాలానికే ఇంత మిడిసిపాటు ఎందుకని వీఆర్వోల సంఘం మండల అధ్యక్షుడు శ్రీను అన్నారు. మంత్రి సిదిరి అప్పరాజు వీఆర్వోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు వీఆర్వోలు మాట్లాడుతూ రాష్ట్ర వీఆర్వోల సంఘం పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఐదేళ్లపాటు పదవీకాలంలో కొనసాగే ప్రజాప్రతినిధులు 60 ఏళ్ల పాటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పని చేసి సేవలందించే వీఆర్వోలపై చిన్నచూపు తగదని హితవుపలికారు. కార్యక్రమంలో మండలంలో పని చేస్తున్న వీఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:55:47+05:30 IST