జిల్లాకు మరో 29 టన్నుల ఉల్లి
ABN , First Publish Date - 2020-10-28T09:19:14+05:30 IST
జిల్లాకు మరో 29 టన్నుల రాయితీ ఉల్లి మంగళవారం వచ్చింది. మహారాష్ట్రలోని సోలాపూర్లో మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు చేసి నేరుగా విశాఖకు పంపించారు.
రాయితీ ధర రూ.40
డ్వాక్రా సంఘాల ధర రూ.67
దిగివస్తున్న రేటు
విశాఖపట్నం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో 29 టన్నుల రాయితీ ఉల్లి మంగళవారం వచ్చింది. మహారాష్ట్రలోని సోలాపూర్లో మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు చేసి నేరుగా విశాఖకు పంపించారు. దీనిని జిల్లాలో 13 రైతుబజార్లకు పంపిణీ చేసి, కిలో రూ.40 చొప్పున రాయితీ ధరపై విక్రయించారు. అయితే గతంలో వచ్చిన ఉల్లి కంటే ఈ ఉల్లి కొంత నాణ్యత తక్కువగా వుందని, డామేజీ ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇదిలావుండగా జ్ఞానాపురం మార్కెట్లో హోల్సేల్ ధర కిలో రూ.65కి తగ్గింది. రైతుబజార్లలో డ్వాక్రా సంఘాలు మొన్నటివరకు కిలో రూ.77కి అమ్మగా మంగళవారం నుంచి కిలో రూ.67 చొప్పున అమ్మారు. బుధవారం ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. రాయితీ ఉల్లి బుధవారం కూడా విక్రయించనున్నట్టు రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు తెలిపారు. తగినంత ఉల్లి అందుబాటులో ఉండటంతో ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, నరసింహనగర్ బజార్లలో సాయంత్రం కూడా రాయితీ ఉల్లి విక్రయిస్తున్నారు. ఇంకో రెండు రోజుల తరువాత మరో లారీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.