వీఎస్‌యూలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-27T05:18:37+05:30 IST

మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వీఎస్‌యూలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నూతన వీసీ సుందరవల్లి, మాజీ వీసీ హరగోపాల్‌రెడ్డి, రిజిస్ర్టార్‌ విజయకృష్ణారెడ్డి

వెంకటాచలం, నవంబరు 26 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను వీఎస్‌యూ రాజనీతి శాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం, నెహ్రూ యువకేంద్రం, సెట్నెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించగా.. వీఎస్‌యూ నూతన వీసీ జీఎం సుందరవల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళ్లర్పించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ వైఆర్‌ హరగోపాల్‌రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  అనంతరం   వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.  కార్యక్రమంలో వీఎస్‌యూ రెక్టార్‌ ఎం. చంద్రయ్య, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ కే సునీత, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌, నెహ్రూ యువకేంద్రం యూత్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఏ మహేంద్రరెడ్డి, సెట్నెల్‌ సీఈవో బీ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


చెముడుగుంటలో..

మండలంలోని చెముడుగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్‌, క్వీజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల సోషల్‌ ఉపాధ్యాయుడు ఎన్‌డీవీ ప్రసాద్‌, బీ శ్రీనివాసులు వారి సొంత నగదుతో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు దేవదానం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


రాజ్యాంగ సృష్టికర్తకు నివాళి

మనుబోలు : 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగం సృష్టికర్త డా.బీఆర్‌. అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. స్థానిక దళితవాడ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు రాయపాటి కిరణ్‌కుమార్‌, బీజేపీ మండలాధ్యక్షుడు ఓడూరు శ్రీనువాసులురెడ్డి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దారు వై. నాగరాజు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వెలుగు కార్యాలయంలో ఏపీఎం శైలజ  పూలమాలలు వేసి నివాళి అర్పించారు.   


తోటపల్లిగూడూరు : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.   ఇస్కపాళెం పాఠశాలలో సర్పంచ్‌ ఇంగిలేల వెంకట చైతన్యకుమార్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి.  కార్యక్రమంలో ఇంగిలేల బాలకృష్ణ, గోలి శ్రీనివాసులు, నారాయణ, ఇల్లపు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సౌత్‌ ఆములూరులోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు షేక్‌.అహ్మద్‌బాషా ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు బి.రామానుజయ్య పర్యవేక్షణలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్‌, వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ.సుభాషిణి, కె.వసంతలక్ష్మి, ఆశా వలంటీర్‌ శిల్ప, విద్యార్థులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-11-27T05:18:37+05:30 IST