శ్రీవారి గజరాజులకు మార్నింగ్ వాక్తో ఆట విడుపు...
ABN , First Publish Date - 2020-04-09T23:26:54+05:30 IST
భూలోక వైకుంఠంగా భక్తులు కీర్తించే తిరుమలలో శ్రీవారి ఏనుగులు గురువారంనాడు వ్యాహ్యాళికి వచ్చినట్టుగా హుందాగా నడుస్తూ సందడి ..
తిరుమల: భూలోక వైకుంఠంగా భక్తులు కీర్తించే తిరుమలలో శ్రీవారి ఏనుగులు గురువారంనాడు వ్యాహ్యాళికి వచ్చినట్టుగా హుందాగా నడుస్తూ సందడి చేశాయి. తీర్చిదిద్దిన తిరునామాలు, మూపురంపై నీలివర్ణం దుస్తులు ధరించిన గజరాజులు మావటీల అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచాయి. దాదాపు రెండు కిలోమీటర్లు కలియ తిరుగుతూ చూపరులను కట్టి పటేశాయి. రోజువారీ వాకింగ్లో భాగంగా శ్రీవారి ఉత్సవ ఏనుగులను ప్రతిరోజూ బయటకు తీసుకువస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి ఏనుగుల వాకింగ్ దృశ్యాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వేడుకలు లేనందున శ్రీవారి ఏనుగులు వాటి సంరక్షణ కేంద్రాలకే పరిమితమవుతున్నాయని, వాటిని చురుకుగా ఉంచేందుకు, బద్ధకం వంటివి దరిదాపునకు రాకుండా, హుషారుగా ఉంచేందుకు శ్రీవారి ఏనుగులతో వాకింగ్ చేయిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఒకే చోట కట్టివేసి ఉంచితే ఏనుగుల కాళ్లకు పుళ్లు పడే ప్రమాదం ఉందని, ఆరోగ్యంగా ఉండాలంటే నడక తప్పనిసరని తెలిపారు. శ్రీవారి గోశాల ఆవులను కూడా కట్టేసి ఉంచకుండా బయటకు వదలుతూ అవి కూడా ఆరోగ్యంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.