కరోనాపై పోరుకు రైతు విరాళం
ABN , First Publish Date - 2020-03-30T10:36:07+05:30 IST
కరోనాపై పోరుకు నేను సైతం.. అంటూ ఓ రైతన్న ముందుకు వచ్చాడు. తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 30
రూ. 30 వేలు ఇచ్చిన ఖమ్మం రైతు బాపయ్య
రూ. లక్ష ఇచ్చిన ఎల్. రమణ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
కరోనాపై పోరుకు నేను సైతం.. అంటూ ఓ రైతన్న ముందుకు వచ్చాడు. తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 30 వేలు విరాళం ప్రకటించాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడుకు చెందిన మద్దుకూరు బాపయ్య ఆదివారం తహసీల్దార్కు చెక్కును అందజేశాడు. కరోనా వల్ల ప్రభావితమవుతున్నవారికి సాయం చేసేందుకు జాతీయ స్థాయిలో పీఎం కేర్స్ ఫండ్కు, రాష్ట్రంలో సీఎం సహాయ నిధికి గణనీయంగా విరాళాలు వస్తున్నాయి. ఆదివారం టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్. రమణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళం అందజేశారు. పీఎం కేర్స్ ఫండ్కు కూడా రూ. లక్ష ఇచ్చారు.
కరోనాపై పోరుకు తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ రెండు రోజుల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు అసోసియేషన్ సెక్రెటరీ, నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఒక రోజు జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్కు, ఒక రోజు జీతాన్ని సీఎం సహాయనిధికి అందిస్తామన్నారు.
రాష్ట్రంలోని సుమారు 15వేల మంది విద్యావలంటీర్లు ఒక రోజు వేతనాన్ని ప్రభుత్వానికి విరాళంగా అందించారు. ఈ మొత్తం సుమారు రూ. 60 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు పీఆర్టీయూ అనుబంధ విద్యావలంటీర్ల సంఘం అధ్యక్షుడు జోగినాథ్ మంత్రి హరీశ్ రావును కలిసి అనుమతి పత్రాన్ని అందజేశారు.