వరంగల్లో కిలాడీ దంపతుల ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-23T17:42:55+05:30 IST
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన దంపతుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన దంపతుల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 21 లక్షల నగదు, రెండు ఖరీదైన కార్లను సీజ్ చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, స్కౌట్స్, గైడ్స్ విభాగానికి సంబంధించిన బెల్ట్, టోపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకులను మోసం చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ ఉన్నతాధికారితో సంబంధాలపై వరంగల్ టాస్క్ ఫోర్స్ టీమ్ కూపీ లాగుతోంది. నిరుద్యోగుల వద్ద నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. 246 మందిని మోసం చేసి ఇప్పటి వరకు రూ. 2 కోట్లు వసూలు చేశారు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితులను రిమాండ్కు తరలించారు.