జీసీసీ పరిధిలో వార్డుకో పీహెచ్‌సీ

ABN , First Publish Date - 2021-10-13T16:20:48+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని 200 వార్డుల్లో తలా ఒకటి చొప్పున 200 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ తెలిపారు. స్థానిక సెంట్ర

జీసీసీ పరిధిలో వార్డుకో పీహెచ్‌సీ

            - మంత్రి కేఎన్‌ నెహ్రూ వెల్లడి


పెరంబూర్‌(చెన్నై): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని 200 వార్డుల్లో తలా ఒకటి చొప్పున 200 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ తెలిపారు. స్థానిక సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రిప్పన్‌ భవనంలో సోమవారం జీసీసీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పథకాలపై సమీక్షాసమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ, నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 70 లక్షల మంది కరోనా టీకాలు వేయించుకోగా, ఆదివారం నిర్వహించిన 5వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో మాత్రమే 9 లక్షల మందికి టీకాలు వేశామని తెలిపారు. ‘సింగార చెన్నై 2.0’ పథకంలో 36 రోడ్లు, 31 ఫుట్‌పాత్‌లను ఆధునీకరించనున్నామన్నారు. పట్టణంబాక్కం బీచ్‌ అంతర్‌ రోడ్డులో నవీన వసతులతో చేపల మార్కెట్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే, 10 పాఠశాలల్లో అదనపు భవనాలు, 4 ఫ్లై ఓవర్లకు మరమ్మతులు, 3 ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్ల కింది భాగంలో పార్కులు ఏర్పాటు చేయనున్నామని, 42 పార్కులు, 18 క్రీడా మైదానాలు ఆధునీకరించనున్నామని, ఈ పనులు త్వరలో ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, జీసీసీ కమిషనర్‌ గగన్‌దీ‌పసింగ్‌ బేదీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-13T16:20:48+05:30 IST