చింతపల్లిలో సమరయోధుల మ్యూజియం
ABN , First Publish Date - 2021-08-04T06:11:39+05:30 IST
సబ్డివిజన్ కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన జేసీ వేణుగోపాల్ రెడ్డి
చింతపల్లి, ఆగస్టు 3: సబ్డివిజన్ కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం చింతపల్లిలో పాడేరు సబ్కలెక్టర్ అభిషేక్తో కలిసి జాయింట్ కలెక్టర్ పర్యటించారు. అంతర్ల సర్వే నంబర్ 108లో ఉన్న పట్టుపరిశ్రమ భూములు, చుంచుంపూడి వద్ద ఏకలవ్య పాఠశాలకు కేటాయించిన ఐటీడీఏ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చింతపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు. కొయ్యూరు మండలంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల స్థల మ్యూజియం కోసం గతంలో తాజంగి డెయిరీ ఫారం భూములు 21.61 ఎకరాలు కేటాయించామన్నారు. ఈ భూములు అప్పగించేందుకు వ్యవసాయ శాఖ తిరస్కరించిందన్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ స్థలం కోసం పరిశీలిస్తున్నామన్నారు. పట్టు పరిశ్రమ శాఖకు చెందిన పది ఎకరాల స్థలాన్ని మ్యూజియం నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడంతో పరిశీలించామన్నారు. అలాగే చింతపల్లిలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కూడా పరిశీలిస్తున్నామన్నారు. మ్యూజియం నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తామన్నారు. ఈ పర్యటనలో పాడేరు డీఐవోఎస్ ప్రసాద్, ఉప తహసీల్దార్ తిరుముల బాబు పాల్గొన్నారు.