గంగులగెడ్డలో వ్యర్థాలు తొలగించాలి
ABN , First Publish Date - 2021-12-04T06:10:14+05:30 IST
గంగుల గెడ్డలో వ్యర్థాలు తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. 31వ వార్డులోని కనకాలవీధి, ప్రకాశరావుపేట, ఎస్బీఐ కాలనీ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు.
31వ వార్డు పర్యటనలో కమిషనర్ లక్ష్మీశ
విశాఖపట్నం, డిసెంబరు 3: గంగుల గెడ్డలో వ్యర్థాలు తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. 31వ వార్డులోని కనకాలవీధి, ప్రకాశరావుపేట, ఎస్బీఐ కాలనీ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గెడ్డలో వ్యర్థాలు పేరుకుపోయి ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తంచేశారు. తక్షణం గెడ్డను శుభ్రపరచాలని, గెడ్డను ఆనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని పార్క్గా మార్చాలని సూచించారు.
గెడ్డను ఆనుకుని ఉన్న ధోబీఘాట్ను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని నిర్వహించాలన్నారు. గంగులగెడ్డలో పలు చోట్ల రక్షణ గోడలు, ర్యాంపులు నిర్మించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ వార్డు అభివృద్ధి పథకంలో వీటిని చేర్చాలని, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలోనే రోడ్లు, కాలువలకు మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంట చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి, జోనల్ కమిషనర్ బి.వి.రమణ, ఇంజనీర్లు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.