chittoor: జలపాతంలో నీట మునిగి ఇద్దరు యువకుల మృతి
ABN , First Publish Date - 2021-10-14T13:36:45+05:30 IST
చిత్తూరు జిల్లా నాగలాపురం మండల పరిధిలోని సద్దికూటి మడుగు జలపాతంలో ప్రమాదవశాత్తు నీట మునిగి తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం మృతిచెందారు. ఎస్ఐ హనుమంతప్ప
సత్యవేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా నాగలాపురం మండల పరిధిలోని సద్దికూటి మడుగు జలపాతంలో ప్రమాదవశాత్తు నీట మునిగి తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం మృతిచెందారు. ఎస్ఐ హనుమంతప్ప తెలిపిన వివరాల మేరకు... చెన్నై-మాధవరం ప్రాంతానికి చెందిన సంజయ్కుమార్, దేవా, విజయ్, సంతోష్, రమేష్, తులసినాథన్ అనే ఆరుగురు యువకులు చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు. వీరు విహారయాత్ర కోసం జలపాతం వద్దకు బుధవారం వచ్చారు. స్నానానికి దిగిన సంజయ్కుమార్, దేవా మడుగులో లోపలికి వెళ్లి బయటకు రాలేకపోయారు. గమనించిన మిగిలిన నలుగురు యువకులు కేకలు వేయడంతో అక్కడ పరిసరాల్లో ఉన్న కొందరు స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. నాగలాపురం ఎస్ఐ హనుమంతప్ప జలపాతం వద్దకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.