ఏప్రిల్ 15 వరకు గోదావరి జలాలను విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-03-09T06:12:26+05:30 IST
రైతులకు గోదావరి జలాలను ఏప్రిల్ 15 వరకు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బిక్కవోలు, మార్చి 8: రైతులకు గోదావరి జలాలను ఏప్రిల్ 15 వరకు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి బిక్కవోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి తహశీల్దారు మాధవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు గత ఖరీఫ్లో సంభవించిన తుపానులకు తీవ్రంగా నష్టపోయినా మరలా రబీకి సన్నద్ధమయ్యారన్నారు. అయితే అధికారులు మార్చి 31 వరకు మాత్రమే గోదావరి నీటిని సాగుకు వదులుతామని ప్రకటించడం, మరోపక్క గోదావరిలో నీటి లభ్యత తక్కువగా వుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. బిక్కవోలు, పందలపాక, కొంకుదురు, ఆరికరేవుల, మెళ్లూరు గ్రామాల్లోని రైతులు సాగునీటి ఎద్దడితో ఇక్కట్లు పడుతూ ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుకుంటున్నారన్నారు. ఆందోళనలో టీడీపీ నేతలు బేరా వేణమ్మ, కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవానందరెడ్డి, రాయుడు రామచంద్రరావు, కానేటి అప్పలస్వామి, పడాల ఆదినారాయణరెడ్డి, తనుకు శ్రీధర్, కానేటి అప్పలస్వామి, జోషిబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.