మోదీకి మమత లేఖ

ABN , First Publish Date - 2021-10-06T21:44:06+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

మోదీకి మమత లేఖ

కోల్‌కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఓ లేఖ రాశారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆనకట్టలు, జలాశయాల వల్ల రాష్ట్రంలో వరదలు సంభవిస్తున్నాయని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. జార్ఖండ్‌లోని పంచేట్, మైథాన్‌లలోని ఆనకట్టల నుంచి నీటిని ప్రణాళిక లేకుండా విడుదల చేయడం వల్ల ఈ సమస్య వస్తోందని తెలిపారు. 


ఈ వరదల సమస్య మానవుడు సృష్టించినదేనని మమత ఆరోపించారు. నియంత్రణ లేకుండా, ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఆగస్టు 4న రాసిన లేఖలో కూడా ఈ వివరాలను తెలిపానని చెప్పారు. మానవుడు సృష్టించిన వరదలు పదే పదే, బాధాకరంగా, విషాదకరంగా దక్షిణ బెంగాల్‌లో సంభవిస్తున్నాయని, దీని వెనుకగల కారణాలను తాను వివరించానని పేర్కొన్నారు. 


భారత ప్రభుత్వం ఈ మౌలిక సమస్యలను స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికపై పరిష్కరించకపోతే, దిగువనున్న తీర ప్రాంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో విపత్తులు కొనసాగుతాయని తెలిపారు. ఆగస్టు 4న తాను రాసిన లేఖపై స్పందన రాలేదని పేర్కొన్నారు. తాను లేవనెత్తిన అంశాలు లక్షలాది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా శ్రద్ధతో చర్యలు చేపట్టాలని కోరారు. 


Updated Date - 2021-10-06T21:44:06+05:30 IST