పైలెట్తో టచ్లోనే ఉన్నాం : బాంబు పేల్చిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-07-13T18:19:01+05:30 IST
సచిన్ పైలెట్కు పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అధిష్ఠానం దూత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్
జైపూర్ : సచిన్ పైలెట్కు పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అధిష్ఠానం దూత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా సోమవారం ప్రకటించారు. తమకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఢిల్లీలో క్యాంపు పెట్టిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. గత 48 గంటల్లో తాము సచిన్ పైలెట్తో టచ్లోనే ఉన్నామని, ఆయనతో సంప్రదిస్తూనే ఉన్నామని వెల్లడించారు. తామంతా ఓ కుటుంబమని, ఏవైనా సమస్యలు తలెత్తితే కలిచి కూర్చుని, ఐకమత్యంగా పరిష్కరించుకుంటామని ఆయన ప్రకటించారు.
‘‘కుటుంబంలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే.. కుటుంబీకులతో కలిసి కూర్చొని చర్చించవచ్చు. సచిన్ పైలెట్తో పాటు ఇతర నేతలకు కూడా కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపున నేను ప్రకటిస్తున్నాను’’ అని ప్రకటించారు. సోమవారం జరిగే శాసన సభా పక్ష సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరై ప్రభుత్వాన్ని మరింత పటిష్ఠం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఎవరికైనా ఇబ్బందులుంటే... పార్టీ వేదికల మీద లేవనెత్తే అవకాశం కచ్చితంగా ఉంటుందని ప్రకటించారు.