పెగాసిస్‌పై మా అభిప్రాయాన్ని సుప్రీం బలపరిచింది: రాహుల్

ABN , First Publish Date - 2021-10-27T22:58:13+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు దృష్టిసారించడం తమకు సంతోషం కలిగించిందని..

పెగాసిస్‌పై మా అభిప్రాయాన్ని సుప్రీం బలపరిచింది: రాహుల్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు దృష్టిసారించడం తమకు సంతోషం కలిగించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటులో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలనే అత్యున్నత న్యాయస్థానం బలపరిచిందని అన్నారు. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని, గోప్యతా హక్కును కాపాడుకోవడం ముఖ్యమని తేల్చిచెప్పింది. దీనిపై రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, పెగాసస్ అంశాన్ని తిరిగి పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. చర్చకు ప్రయత్నిస్తామని, అయితే చర్చకు బీజేపీ ఇష్టపడదనే విషయం తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు.


పెగాసస్‌ను ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులు, బీజేపీ మంత్రులు తదితరులపై ఉపయోగించారని, పెగాసస్ ద్వారా ఆ సమాచారం ప్రధానమంత్రి, హోం మంత్రికి అందేదని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్, సీఈసీ, విపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ డాటా ప్రధానికి వెళ్లడమంటే అది క్రిమినల్ చర్య కిందకే వస్తుందని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్య పెగాసస్ అని, ఈ అంశాన్ని తాము పరిశీలంచగలమని సుప్రీంకోర్టు చెప్పడం చాలా పెద్ద ముందడుగని అన్నారు. అసలు నిజం బయటకు వస్తుందనే గట్టి నమ్మకం తనకుందని రాహుల్ పేర్కొన్నారు.


గత పార్లమెంటు సమావేశాల్లో పెగాసస్ అంశాన్ని తాము లేవనెత్తామని, తాము ఏదైతే చెప్పామో దానికి మద్దుతాగా ఇవాళ సుప్రీంకోర్టు అభిప్రాయం ఉందని అన్నారు. పెగాసస్‌ ఆథారిటీ ఎవరిది? ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగించారు? మన ప్రజల సమాచారం ఏ ఇతర దేశమైనా పొందే అవకాశం ఉందా? అనేవే తమ మూడు ప్రధాన ప్రశ్నలని రాహుల్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-27T22:58:13+05:30 IST