'బోనులో ఉన్న పులి'తో స్నేహం ఏంటి?: బీజేపీ నేత వివరణ

ABN , First Publish Date - 2021-06-11T20:12:43+05:30 IST

పులితో (శివసేన పార్టీ గుర్తు) బీజేపీ స్నేహం చేస్తుందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్..

'బోనులో ఉన్న పులి'తో స్నేహం ఏంటి?: బీజేపీ నేత వివరణ

పుణె: పులితో (శివసేన పార్టీ గుర్తు) బీజేపీ స్నేహం చేస్తుందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ శుక్రవారంనాడు వివరణ ఇచ్చారు. ''బోనులో ఉన్న పులి''తో మైత్రి నెరపాలని తమ పార్టీ కోరుకోవడం లేదని అన్నారు. తన బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాటిల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్, పుణె, మరి కొన్ని ప్రధాన సిటీల్లో 2022 ప్రారంభంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.


పులలతో తామెప్పుడూ స్నేహంగా ఉంటామంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పాటిల్ స్పందిస్తూ, ఇటీవల తాను ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జంతుసంరక్షణ కేంద్రంలో పనిచేసే ఒక వ్యక్తి పులి నమూనాతో పాటు ఫోటో అల్బమ్ బహుమతిగా ఇచ్చాడని, ఇందుకు గాను చక్కటి బహుమతి ఇచ్చావని చెబుతూ, పులులకు తామెప్పుడూ మిత్రులమని తాము పేర్కొన్నట్టు తెలిపారు. అయితే మీడియా మిత్రులు శివసేన పార్టీ గుర్తు కూడా పులి కావడంతో దానితో తన వ్యాఖ్యలను పోల్చినట్టు ఆయన పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండానే గెలిచి పార్టీని నెంబర్ వన్ పొజిషన్‌లోకి తీసుకు వెళ్లాలని ఈ పుట్టినరోజున తాను బలంగా తీర్మానించుకున్నట్టు పాటిల్ తెలిపారు. కాగా, పులితో (శివసేన) బీజేపీ స్నేహం చేస్తుందని చంద్రకాంత్‌ పాటిల్‌ వ్యాఖ్యలను మీడియా ప్రముఖంగా ప్రస్తావించగా, పులితో ఎవరూ స్నేహం చేయలేరని, ఎవరితో స్నేహం చేయాలో నిర్ణయించేది పులియే అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ వ్యాఖ్యానించారు. దానిపైనే పాటిల్ తన తాజా వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-06-11T20:12:43+05:30 IST