కేంద్రంతో ధాన్యం కొనిపిస్తాం
ABN , First Publish Date - 2022-04-09T05:27:41+05:30 IST
కేంద్రం మెడలు వంచి యాసంగి ధాన్యాన్ని కొనిపిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 8: కేంద్రం మెడలు వంచి యాసంగి ధాన్యాన్ని కొనిపిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీసంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ నల్ల చొక్కాను ధరించి తన ఇంటిపై నల్ల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో పండించిన ప్రతి ధాన్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని, గల్లి నుంచి మొదలైన ఈ ఉద్యమాన్ని ఢిల్లీకి విస్తరిస్తామని తెలిపారు. మేయర్ వై సునీల్రావు భగత్నగర్లోని ఆయన నివాసగృహంపై నల్ల జెండాలు ఎగురవేసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతుందని విమర్శించారు. వరిపంట వేయండి, ధాన్యం కొంటామని రైతులను మభ్యపెట్టిన బండి సంజయ్కుమార్ ముఖం చాటేశారని, రైతులనుంచి కేసీఆర్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మోదీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్లు గందె మాధవి మహేశ్, మెండి శ్రీలత చంద్రశేఖర్తోపాటు పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు వారి వారి ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.