ఇసుక కొరతతో రోడ్డున పడ్డాం
ABN , First Publish Date - 2021-12-02T06:34:38+05:30 IST
కరోనాతో పనులు లేక అల్లాడుతున్న సమయంలో ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయటంతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు హరికృష్ణారెడ్డి అన్నారు.
సమస్యలు పరిష్కరించాలని భనవ నిర్మాణ కార్మికుల నిరసన
కంచికచర్ల రూరల్ : కరోనాతో పనులు లేక అల్లాడుతున్న సమయంలో ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయటంతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు హరికృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయటంతో పాటు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహీల్దార్ రాజకుమారి, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ బోర్డు నుంచి బాధిత కార్మికులకు అందాల్సిన పరిహారం నేటికీ అందలేదన్నారు. దీనికి తోడు పనులులేక జీవనం సాగక కార్మికులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు భూషణం, రాజు, గాలీషా, కొండ, వీరయ్య, శీను. స్వామి, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.