మదనపల్లెను జిల్లాకేంద్రంగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2022-01-27T05:24:32+05:30 IST

మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి.

మదనపల్లెను జిల్లాకేంద్రంగా ప్రకటించాలి
అఖిలపక్ష సమావేశంలో ఐక్యతచాటుతున్న మాజీఎమ్మెల్యేలు, ప్రజాసంఘాల నాయకులు

మదనపల్లె అర్బన్‌, జనవరి 26: మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. బుధవారం పట్టణంలోని బీటీ కళాశాలలో ఠాగూర్‌ కాటేజీ వద్ద అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్‌ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కల్గిన మదనపల్లెను జిల్లా చేయకుంటే ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మదనపల్లెను జిల్లా కేంద్రం చేయడానికి బాధ్యత తీసుకోవాలన్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ మదనపల్లెకు అన్యాయం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర మాట్లాడుతూ సీఎం జగన్‌ స్వార్థం కోసం ప్రజల మనోభావాలు, స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా జిల్లాలను విభజించాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాటకొండ మధుబాబు, నరసింహులు, దారం అనిత పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:24:32+05:30 IST