ఆరోగ్యనగరంలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2020-06-02T09:45:54+05:30 IST
ఆరోగ్యనగరంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పరిసరాల పరిశుభ్రత కేవలం ప్రభుత్వం
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, జూన్ 1: ఆరోగ్యనగరంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పరిసరాల పరిశుభ్రత కేవలం ప్రభుత్వం బాధ్యతమాత్రమే కాదని, పౌరులందరి బాధ్యత అని అన్నారు. కరీంనగర్ను సేఫ్జోన్, ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని డంపుయార్డులో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్రావు, కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన డంపింగ్యార్డులో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
దీన్ని నివారించేందుకు 60లక్షల రూపాయలతో కార్పొరేషన్ ప్రొక్లైయిన్ కొనుగోలు చేసిందని, దీనితో రోజు వచ్చే 150 మెట్రిక్ టన్నుల చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తామని చెప్పారు. అలాగే ఈ డంపింగ్యార్డును త్వరలోనే వేరొక చోటికి మార్చి శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. ఆ తర్వాత 9వ డివిజన్ అలకాపురికాలనీలో డ్రెయినేజీల్లో గంబూసియా చేపపిల్లలను మేయర్ సునీల్రావు, కమిషనర్ క్రాంతి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు ఐలేందర్యాదవ్, బండారి వేణుతో కలిసి వేశారు. 31వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.