లఖ్నవూ ఎయిర్పోర్ట్లో నిరసనకు దిగిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-10-06T20:43:49+05:30 IST
మేము నా కారులోనే లఖింపూర్కు వెళ్లాలని అనుకుంటున్నాం. కానీ పోలీసులు వేరే వాహనంలో వెళ్లాలని అడ్డుకుంటున్నారు. నా వ్యక్తిగత వాహనంలోనే వెళ్లనివ్వండని నేను వాళ్లను అడిగాను. అయినా వాళ్లు వినడం లేదు. మాకు ప్రత్యేకంగా వాహనాలు..
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్కి వెళ్లేందుకు లఖ్నవూ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలతో కలిసి ఎయిర్పోర్ట్లోనే ఆయన బైఠాయించి నిరసనకు దిగారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం చన్నీ, ఛత్తీస్గఢ్ సీఎం బూపేష్ భాఘేల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా బైఠాయించారు. సొంత వాహనంలో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో వెళ్లాలని పోలీసులు షరతు పెట్టారు. దీనికి రాహుల్ గాంధీ నిరాకరించారు. యోగి ప్రభుత్వం ఏదో ప్లాన్ చేసిందని, తాను తన సొంత వాహనంలో తప్ప మరే ఇతర వాహనంలో వెళ్లనని రాహుల్ తేల్చి చెప్పారు. అయినప్పటికీ పోలీసులు వినకపోవడంతో లఖ్నవూ ఎయిర్పోర్ట్లోనే రాహుల్ నిరసనకు దిగారు.
పోలీసుల అడ్డగింతపై రాహుల్ స్పందిస్తూ ‘‘మేము నా కారులోనే లఖింపూర్కు వెళ్లాలని అనుకుంటున్నాం. కానీ పోలీసులు వేరే వాహనంలో వెళ్లాలని అడ్డుకుంటున్నారు. నా వ్యక్తిగత వాహనంలోనే వెళ్లనివ్వండని నేను వాళ్లను అడిగాను. అయినా వాళ్లు వినడం లేదు. మాకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం వెనుక ఏదో ప్లాన్ ఉంది. నా వాహనంలో కాకుండా వేరే వాహనంలో వెళ్లను. నా వాహనంలో వెళ్లనిచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటా’’ అని అన్నారు.
కాగా, లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు అనుమతి ఇవ్వలేదు. ఎట్టకేలకు బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. ప్రియాంక గాంధీని లఖింపూర్ చేరకుండా రెండ్రోజుల క్రితమే పోలీసులు అడ్డుకుని గెస్ట్ హౌస్కు తరలించగా, రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని తీసుకుని న్యూఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక, మరో ముగ్గురిని లఖింపూర్లో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు రాష్ట్ర హోం శాఖ ప్రకటన విడుదల చేసింది.