మూడు షరతులకు లోబడి ప్రభుత్వపరం చేస్తాం
ABN , First Publish Date - 2021-11-28T05:42:10+05:30 IST
బిసెంట్ సెనిటరీ ట్రస్టు చెబుతున్న మూడు షరతులకు ప్రభుత్వం అంగీకరిస్తేనే బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తామని కళాశాల కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నమయ్య ప్రభుత్వానికి లేఖ రాశారు.
బీటీ కళాశాల కరస్పాండెంట్ లేఖ
మదనపల్లె టౌన్, నవంబరు 27: బిసెంట్ సెనిటరీ ట్రస్టు చెబుతున్న మూడు షరతులకు ప్రభుత్వం అంగీకరిస్తేనే బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తామని కళాశాల కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నమయ్య ప్రభుత్వానికి లేఖ రాశారు. శనివారం స్థానిక బీటీ కళాశాలలో కరస్పాండెంట్ మాట్లాడుతూ... ప్రభుత్వ లైజనింగ్ అధికారిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణికి ఈ మేరకు అఫిడవిట్ అందజేశామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బీటీ కళాశాలలోని ఎయిడెడ్ అధ్యాపకులు, సిబ్బంది ప్రభుత్వంలో విలీనం అయ్యాక... తాము కళాశాలను అన్ని వసతులు, అధ్యాపకులతో ప్రైవేటుగానే నిర్వహిస్తున్నామన్నారు. బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయడంలో బీసీటీ సెక్రటరీ సుధాకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనికి బీసీటీ మూడు షరతులు పెట్టిందన్నారు. ఒక వేళ ప్రభుత్వపరం చేసినా.. కళాశాలకు అనిబిసెంట్ పేరు చిరస్థాయిగా ఉంచాలని, కళాశాలకు చెందిన 45.36 ఎకరాల ఆస్తులను, భవనాలను అన్యాక్రాంతం చేయరాదని, భవిష్యత్తులో బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం స్థాయికి చేర్చాలని పేర్కొన్నారు. వీటికి ప్రభుత్వం అంగీకరిస్తేనే బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసేలా బీసీటీ చర్యలు తీసుకుంటుందన్నారు.
చర్చల పేరిట కాలయాపన చేస్తే పోరాటం ఉధృతం
బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తామని... చర్చిస్తున్నామని కాలయాపన చేస్తే పోరాటం ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెగేసి చెప్పారు. శనివారం బీటీ కళాశాల కరస్పాండెంట్ మునిరత్నమయ్యతో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశమయ్యారు. బీసీటీ చెపుతున్న మూడు షరతులపై ప్రభుత్వం ఆలోచించాల న్నారు. వెంటనే ఈ విషయమై కరస్పాండెట్ బీసీటీ దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం అందజేశారు. నవీన్కుమార్, మురళి, ఉత్తన్న, మాధవ్, జయప్రకాష్, మీనా, స్నేహ, భావన పాల్గొన్నారు.