పరిహారం చెల్లించి.. పనులు చేపడతాం
ABN , First Publish Date - 2021-07-29T05:09:53+05:30 IST
వంశధార నది కరకట్టల నిర్మాణానికి సంబంధించి భూమలు కోల్పోతున్న రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించిన తరువాతే పనులు ప్రారంభిస్తామని జేసీ సుమిత్కుమార్ పేర్కొన్నారు. ఎల్.ఎన్.పేట మండలం మోదుగవలస, స్కాట్పేట గ్రామాలకు సంబంధించిన నదీ తీర భూములను బుధవారం ఆయన పరిశీలించారు.
- జేసీ సుమిత్కుమార్
మోదుగవలస(ఎల్.ఎన్.పేట), జూలై 28: వంశధార నది కరకట్టల నిర్మాణానికి సంబంధించి భూమలు కోల్పోతున్న రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించిన తరువాతే పనులు ప్రారంభిస్తామని జేసీ సుమిత్కుమార్ పేర్కొన్నారు. ఎల్.ఎన్.పేట మండలం మోదుగవలస, స్కాట్పేట గ్రామాలకు సంబంధించిన నదీ తీర భూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మోదుగులవలసకు చెందిన రామారావు, మరికొందరు రైతులు మాట్లాడుతూ.. గతంలో రైతుల భూములకు పరిహారం తక్కువగా ఇచ్చారని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. గతంలో భూములకు ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఎకరాకు రూ.19.70 లక్షల చొప్పున చెల్లించిందన్నారు. పరిహారం పెంచడం తమ చేతుల్లో లేదని, అయినా రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
చర్యలు తప్పవు
అనంతరం పెద్దకొల్లివలస ఆర్అండ్ఆర్కాలనీ గ్రామసచివాలయాన్ని జేసీ సందరించారు. సచివాలయ ఉద్యోగుల విధి నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయ పాలన పాటించాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు విధులను నిర్వర్తించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు. హాజరుపట్టిక, మూమెంట్ రిజిస్టర్లో నమోదు తప్పనిసరి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్యామల, తహసీల్దార్ వీఎస్ఎస్సత్యనారాయణ, సర్వేయర్ జి.గవరయ్య పాల్గొన్నారు.