ఈటలకు మద్దతుగా ఉంటాం
ABN , First Publish Date - 2021-05-05T08:19:55+05:30 IST
రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు ఆందోళనలు నిర్వహించారు.
- బహుజన, బీసీ విద్యార్థి సంఘాలు..
- హుజూరాబాద్కు తరలివచ్చిన అభిమానులు
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్): రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు ఆందోళనలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ‘మీ వెంట మేము ఉంటాం... మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’ అని భరోసా ఇచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై వారందరితో ఈటల మాట్లాడారు. ఉదయం 7గంటలకు అమెరికా ఎన్నారైలతో జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో వారి అభిప్రాయాలు తీసుకున్నారు. కాగా, ఈటలకు మద్దతుగా ఓయూలో నిర్వహించిన సమావేశంలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని అన్నారు. ఈటలపై మంత్రులు కొప్పుల, గంగుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చేసిన విమర్శలు సరికావని బీసీ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు.
ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్కు చౌరస్తాలోని బీసీ భవన్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్ వివిధ సంఘాలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ఈటలకు మద్దతుగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గం కేంద్రాలలో బీసీ సంఘాల నేతలు దీక్షలు చేపట్టారని ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. నారాయణపేట కోస్గి పట్టణంలో ముదిరాజ్ సంఘం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ అంబర్పేటలో ముదిరాజులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ముదిరాజ్లు ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా ఉపాధి హామీ రాష్ట్ర గవర్నింగ్ కమిటీ మెంబర్ తుపాకుల బాల్రంగం ఈటలను కలిశారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్గా ఉన్నట్లు తెలిసింది.