వంద స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తాం

ABN , First Publish Date - 2021-12-01T05:40:16+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అపజయం తప్పదని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వంద సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు.

వంద స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తాం
మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, నవంబరు 30: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అపజయం తప్పదని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వంద సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల విసృత స్థాయి సమావేశాన్ని స్థానిక పొన్నాల గార్డెన్‌లో కాంగ్రెస్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డితో పాటు ఏఐసీసీ డాటా సెల్‌ కో-ఆర్డినేటర్‌ దీపక్‌ జాన్‌లు హాజరై కాంగ్రెస్‌ పార్టీ  డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేం దుకే డిజిటల్‌ సభ్యత్వ నమోదును చేపట్టినట్లు పేర్కొ న్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధానం కాదని సమాజ సేవే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన విధానాలతో ముందు కు వెళ్తున్నామన్నారు.  104, 108, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలను ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడితే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సేవలను నిలిపి వేసి కార్పొరేట్‌ ఆసుపత్రులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఆడపిల్ల పుడితే బాలిక సంరక్షణ పథకంలో బాగంగా రూ. రెండు లక్షలు అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాలిక సంరక్షణ పథకాన్ని నిలిపివేసి కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని ఈ పథకానికి పుట్టినిల్లు కాంగ్రెస్‌ పార్టే అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కల్యాణ లక్ష్మి పథకంలో రూ. లక్షతో పాటు నూతన దంపతుల గృహ నిర్మాణానికి రూ. 5 లక్షల అందిస్తామని హామీ ఇచ్చా రు. సభ్యత్వ నమోదులో మహిళల చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐసీసీ డాటా సెల్‌ కో-ఆర్డినేటర్‌ దీపక్‌ జాన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వాలను పెంచేవిధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి, అధికారంలోకి రావాలంటే సభ్యత్వాలే కీలకమన్నారు. రూ. 5లతో సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా రూ. 2 లక్షలు వర్తిస్తుందని వివవరించారు. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా డిజిటల్‌ సభ్యత్వాల నమోదులో ప్రథమ స్థానంలో నిలువాలన్నారు. 

కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, నిజామాబాద్‌ జిల్లా  డాటా సెల్‌ కో-ఆర్డినేటర్‌ అవేజ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు గిరి నాగభూషణం, విజయ లక్ష్మి దేవేందర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, జగిత్యాల రూరల్‌, అర్బన్‌, సారంగపూర్‌, రాయికల్‌, బీర్‌పూర్‌ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జున్ను రాజేందర్‌, శ్రీరాముల గంగాధర్‌, రాంచంద్రారెడ్డి, సుభాష్‌, రవీంద ర్‌రావు, గాజెంగి నందయ్య, నాయకు లు దుర్గయ్య, గాజుల రాజేందర్‌, జీవన్‌, మసర్తి రమేష్‌,  మన్సూర్‌, రియాజ్‌, మధు, రఘువీర్‌, నేహాల్‌, చాంధ్‌ పాష, అశోక్‌, రమేష్‌ రావు ఉన్నారు.

Updated Date - 2021-12-01T05:40:16+05:30 IST