Meerabai Chanu : ఎనిమిదో తరగతి పుస్తకం దిశను మార్చేసింది
ABN , First Publish Date - 2021-07-24T21:36:00+05:30 IST
టోక్యో వేదికగా జరుగుతున్న ఒలంపిక్స్లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన వీరోచిత
న్యూఢిల్లీ :టోక్యో వేదికగా జరుగుతున్న ఒలంపిక్స్లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆమెపై టార్చ్ లైట్ పడింది. మీరాబాయి 1994 ఆగస్టు 8 న మణిపూర్లోని నాంగ్పాక్ కాచింగ్ గ్రామంలో జన్మించింది. ప్రారంభంలో ఆర్చర్గా మారాలని భావించినా, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల తన కెరీర్ను వెయిట్ లిఫ్టింగ్ వైపు మరుల్చుకోవాల్సి వచ్చింది. తన బాల్యం చాలా కష్టాలతో సాగింది. చిన్నతనంలోనే అడవుల నుంచి కట్టెలు కొట్టుకొని వచ్చేది. అయినా, అన్ని కష్టాలనూ ఎదుర్కొంది. చిన్న తనం నుంచే ఎక్కువ బరువులను మోసేది. చిన్న తనంలో ఆర్చర్ కావాలని ప్రగాఢంగా అనుకునేది. కానీ 8వ తరగతి వచ్చే సరికి ఆమె లక్ష్యం మొత్తం మారిపోయింది. ఎనిమిదో (8) తరగతి పుస్తకంలో ప్రసిద్ధ వెయిట్ లిఫ్టర్ కుంజ్రానీ దేవి గురించి ఉంది. ఆ పాఠాన్ని మీరాబాయి క్షుణ్ణంగా చదివింది. ఆ పాఠం మీరాబాయి మనస్సులో అలా ముద్రపడిపోయింది. ఆర్చర్ కావాలనుకున్న మీరాబాయి వెయిట్ లిఫ్టర్గా మారిపోయింది. ఇందులో చాలా సాధన చేసింది. 2014 లో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల బరువు విభాగంలో భారత్ తరపున రజత పతకం సాధించింది. ఆ తర్వాత కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా... టోక్యో వేదికగా భారత కీర్తి పతాకాన్ని గగన వీధుల్లో ఎగరేసింది.