సంక్షేమ పథకాలు తగ్గించాలి
ABN , First Publish Date - 2020-07-07T10:18:40+05:30 IST
సంక్షేమ పథకాలను తగ్గించి, పెట్టుబడులపై దృష్టి సారించాలని వివిధ దేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు సూచించారు. ప్రాథమిక రంగంపై
పెట్టుబడులు పెరిగితేనే అభివృద్ధి
స్వదేశీ, విదేశీ ఆర్థిక నిపుణుల సూచన
సిల్వర్ జూబ్లీలో అంతర్జాతీయ సదస్సు
కర్నూలు(అర్బన్), జూలై 6: సంక్షేమ పథకాలను తగ్గించి, పెట్టుబడులపై దృష్టి సారించాలని వివిధ దేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు సూచించారు. ప్రాథమిక రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని, అప్పుడే భారతదేశం సవాళ్లను అధిగమించి అభివృద్ధి సాధించగలదని వారు అభిప్రాయపడ్డారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ’కొవిడ్ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం - సమస్యలు, సవాళ్లు’ అన్న అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల ఆర్థిక వేత్తలు ఆన్లైన్లో ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
లాక్డౌన్ సమయంలో భారత దేశం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. వస్తు సేవల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని భారత దేశం తగ్గించుకోవాలని వారు సూచించారు. సంక్షేమ పథకాల కోసం చేసే ఖర్చును తగ్గించుకోవాలని, ఆ సొమ్మును వివిధ రంగాలలో పెట్టుబడుల కోసం వినియోగించాలని సూచించారు. 5.8 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
సదస్సుకు సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ సుబ్రమణ్యకుమార్ అధ్యక్షత వహించాఉ. ఆర్యూ రిజిస్ట్రార్ వెంకట సుందరానంద పుచ్చా, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి, కాకర వాడ చిన్న వెంకట స్వామి, ఎంబీసీ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాంగ్లాదేశ్, నైజీరియా, టాంజానియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల ఆర్థిక నిపుణులు ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించారు. జమ్మూ, కశ్మీర్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాళ్, బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాల ప్రొఫెసర్లు హాజరయ్యారు.