ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-05-08T07:42:53+05:30 IST

పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం సహజీవనం కూడా చేసిన ప్రియుడు మోసం చేయటంతో ఆ ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతున్న యువతి

యువతిది తెలంగాణ, ఉద్యోగం చేసేచోట పరిచయం

కందుకూరు, మే 7 : పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం సహజీవనం కూడా చేసిన ప్రియుడు మోసం చేయటంతో ఆ ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వారి సామాజిక వర్గాలు వేరైనందున పెద్దలు అంగీకరించనందున వివాహం చేసుకోలేనని ఆ యువకుడు తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందు, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె బంధువులు వెంటనే గుర్తించి కందుకూరు ఏరియా హాస్పటల్‌లో చేర్పించటంతో ప్రాణాపాయం తప్పింది. కందుకూరులో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి...

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలేనికి చెందిన మాల్యాద్రిరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి బి. ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మండల కేంద్రమైన కోయలకుంట్ల గ్రామానికి చెందిన దళిత యువతి కూడా బి.ఫార్మసీ పూర్తి చేసి అదే కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని బ్రహ్మారెడ్డి నమ్మబలకటంతో వారిద్దరూ కొన్ని నెలలు సహజీవనం చేసినట్లు సమాచారం. ఇద్దరి కులాలు వేరు కావటంతో పెళ్లి చేసేందుకు ఆ యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మా పెద్దలు ఒప్పుకుంటేనే పెళ్లి సాధ్యమని, వారిని ఒప్పించే బాధ్యత నీవే తీసుకోవాలని ఆ యువతికి బ్రహ్మారెడ్డి చెప్పాడు. దీంతో ఆమె 6 నెలల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు బ్రహ్మారెడ్డిని, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొంచెం సమయం ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఆ యువ కుడు తన ఉద్యోగాన్ని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరుకి మార్చుకుని ఆమెకు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో నెల క్రితం ఆ యువతి నేరుగా తిమ్మారెడ్డిపాలెం చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామస్థులకు చెప్పటంతో పాటు బ్రహ్మారెడ్డి తల్లిదండ్రులను నిలదీసింది. ఈ క్రమంలో ఆ యువకుడు కూడా కొంత సమయం ఇస్తే తమ తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి సర్థిచెప్పి పంపాడు. దీనిపై పలు దళిత సంఘాలు, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు కూడా జోక్యం చేసుకుని బ్రహ్మారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మాట్లాడుకుందామని అందర్నీ పిలిపించారు. గురువారం ఆ యువతి బంధువులంతా కందుకూరు వచ్చారు. బ్రహ్మారెడ్డి కుటుంబసభ్యులు, అతని తరఫు పెద్దలు కూడా వచ్చారు. అందరి సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఎంతోకొంత డబ్బు ఇస్తానని, పెళ్లి మాత్రం చేసుకునేది లేదని ఆ యువకుడు తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ యువతి మనస్తాపం చెంది అక్కడే ఆత్మహత్యాయత్నం చేయగా హుటాహుటిన హాస్పటల్‌కు తరలించారు. శుక్రవారం ఆమె పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటంతో డిశ్చార్జి చేసుకుని ఆమె తరఫు వారు జడ్చర్లకు తీసుకెళ్లారు. జడ్చర్ల పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైనందున అక్కడి నుంచే న్యాయపోరాటం చేస్తామని ఆ యువతి బంధువులు చెప్పారు.


Updated Date - 2021-05-08T07:42:53+05:30 IST