ఎన్నికల హింసను మమత గుర్తించాలి : గవర్నర్ ధన్‌కర్

ABN , First Publish Date - 2021-05-15T20:09:31+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ

ఎన్నికల హింసను మమత గుర్తించాలి : గవర్నర్ ధన్‌కర్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ శిక్షించే స్వభావంతో ఉందని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ అన్నారు. ఈ విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీని కోరారు. రాష్ట్రం కోవిడ్-19 మహమ్మారి వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి తోడుగా శిక్షించే స్వభావంగల హింసాకాండ జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఇలాంటి హింసాత్మక సంఘటనల గురించి తాను గతంలో ఎన్నడూ వినలేదన్నారు. ఆయన శనివారం నందిగ్రామ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.


ఈ హింసాకాండ వల్ల లక్షలాది మంది బాధపడుతున్నారని, ఈ విషయాన్ని మమత బెనర్జీ గుర్తించాలని ధన్‌కర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు అగ్ని పర్వతం మీద కూర్చున్నట్లు ఉన్నాయని, ఇతరులు నిర్బంధించడంతో ప్రజలు తమ ఇళ్ళను ఖాళీ చేశారన్నారు. రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నపుడు మనం నిద్రపోకూడదన్నారు. ప్రజలు అన్ని రకాల నేరాలకు బాధితులవుతున్నారని, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, డబ్బు గుంజుకునే పన్నులు వంటివాటికి ప్రజలు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ధన్‌కర్ కోరారు. బాధితులకు పునరావాసం, విశ్వాసం కల్పించేందుకు,  నష్టపరిహారం అందజేసేందుకు మమత బెనర్జీ చొరవ తీసుకోవాలన్నారు. ప్రజలను విభజించే శక్తుల ఆధిపత్యాన్ని నియంత్రించాలని కోరారు. బాధితులు పోలీసులను చూస్తే భయపడుతున్నారని, తమనే నిందితులుగా ఆరోపణలు నమోదు చేస్తారని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 


నందిగ్రామ్ శాసన సభ నియోజకవర్గంలో మమత బెనర్జీ పరాజయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. 


Updated Date - 2021-05-15T20:09:31+05:30 IST