మూతబడిన కాలేజీలో కొండచిలువ కాపురం... తరువాత?
ABN , First Publish Date - 2020-09-23T12:51:20+05:30 IST
కరోనా మహమ్మారి నేపధ్యంలో విధించిన లాక్డౌన్లో అన్ని విద్యాసంస్థలు మూతబడిన విషయం విదితమే. ఇదేవిధమైన పరిస్థితి బీహార్లోని బగహాలో కూడా నెలకొంది.
బగహా: కరోనా మహమ్మారి నేపధ్యంలో విధించిన లాక్డౌన్లో అన్ని విద్యాసంస్థలు మూతబడిన విషయం విదితమే. ఇదేవిధమైన పరిస్థితి బీహార్లోని బగహాలో కూడా నెలకొంది. అయితే ఇక్కడికి సమీపంలో గల అడవుల నుంచి జంతువులు నివాస ప్రాంతాల్లోకి రావడం ప్రారంభించాయి. ఇటువంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పాములు, కొండ చిలువలు కనిపించడం సాధారణంగా మారిపోయింది.
తాజాగా బగహాలోని మధుబని పంచాయతీ పరిధిలోగల హర్దేవ్ ప్రసాద్ ఇంటర్మీడియట్ కాలేజీ ప్రాంగణంలో కొండచిలువ తిష్టవేసి ఉండటాన్ని అక్కడికి వచ్చిన చిన్నారులు చూశారు. ఈ విషయం అక్కడికి సమీపంలో ఉంటున్న అందరికీ తెలిసింది. దీంతో దానిని చూసేందుకు తండోపతండాలుగా జనం రాసాగారు. దానిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు వారు ప్రయత్నించారు. ఇంతలో కొంతమంది ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో వారు అక్కడకు చేరుకుని, ఆ కొండ చిలువను పట్టుకుని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.