మాస్కుల్లేవు.. భౌతిక దూరం పాటించరు
ABN , First Publish Date - 2021-02-25T05:17:27+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది.
కరోనాపై అప్రమత్తత ఏదీ?
పొంచి ఉన్న కరోనా ముప్పు!
నిడదవోలు, ఫిబ్రవరి 24: కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే జిల్లా అధికార్లను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని మరింత జాగ్రత్తగా ఉండాలని. అయితే క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు తెరుచుకుని జనజీవనం సాధారణ స్థితికి చేరువయ్యింది. అయితే పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వం ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని భౌతికదూరం పాటించాలని చెపుతున్నా ఇవి అమలుకావడం లేదు. పాఠశాలల్లో అతికొద్దిమంది విద్యార్థులు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. భౌతిక దూరం పూర్తిగా పక్కన పెట్టేశారు. సినిమా హాల్స్లోను, ఆర్టీసి డిపో వద్ద గుంపులు గుంపులుగా కలవడం, మాస్కులు ధరించకపోవడం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పుంజుకొంటున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికార్లు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులంతా భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.