రెట్టింపు జీతం ఇస్తామన్నా నో..నో.. !

ABN , First Publish Date - 2020-08-10T18:13:49+05:30 IST

జిల్లాలో తీరం వెంబడి చేపట్టిన 216 జాతీయ రహదారి పనులపై కరోనా ఎఫెక్ట్‌..

రెట్టింపు జీతం ఇస్తామన్నా నో..నో.. !

జిల్లాకు రానంటున్న ఇతర రాష్ట్రాల కార్మికులు

కరోనా కేసుల భయయే కారణం

216 జాతీయ రహదారి పనుల్లో జాప్యం


నరసాపురం(పశ్చిమ గోదావరి): జిల్లాలో తీరం వెంబడి చేపట్టిన 216 జాతీయ రహదారి పనులపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ఈ పనులు చేసేందుకు బిహార్‌, ఒడిశా, యూపీ, కోల్‌కతా నుంచి వచ్చిన కార్మికులు కరోనా భయంతో వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. మూడు నెలల నుంచి ఎక్కడ పనులు ఆక్కడే నిలిచిపోయాయి. వెళ్లిపోయిన కార్మికుల్ని రప్పించేందుకు రెట్టింపు జీతాలు ఇస్తాం ..రమ్మని పిలుస్తున్నా రామని తెగేసి చెప్పేస్తున్నారు. జిల్లాలో చించినాడ నుంచి భీమవరం మండలం లోసరి వరకు సుమారు 51 కిలోమీటర్ల మేర 216 జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే వంతెనలు పెండింగ్‌ పడ్డాయి. నరసాపురం మండలం సీతారాంపురం వద్ద భారీ వంతెన  నిలిచిపోయింది.


అలాగే రుస్తుంబాద, పాలకొల్లు రోడ్డులోని లాకుల వద్ద రెండు వంతెనలు, పద్మశ్రీకాలనీ వద్ద ఒక వంతెన పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిర్మాణ పనుల్లో బీహార్‌, యూపీ, ఒడిశా కార్మికులకు మంచి నైపుణ్యం ఉంది. దీంతో చాలా కంపెనీలు ఆ రాష్ర్టాల నుంచి కార్మికుల్ని తెప్పించుకుని పనుల్ని చేయిస్తుంటాయి. ఈ ఏడాది మార్చిలో కరోనా, లాక్‌డౌన్‌ కాలంలో వీరంతా వారి వారి రాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఆరునెలల్లో పనులు పూర్తి చేయాలని కేంద్రం గడువు ఇచ్చింది. అయితే స్కిల్డ్‌ లేబర్‌ లేకపోవడంతో పనులకు బ్రేక్‌పడింది. వెళ్లిన కార్మికుల్ని రప్పించేందుకు గుత్తేదారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్లు మాత్రం రావడం లేదు. గతంలో కార్మికుడికి రోజుకు రూ.600 ఇచ్చేవారు.  సీనియర్‌ అయితే రూ.800 ఉండేది. ఇప్పుడు కాంట్రాక్టర్లు రెట్టింపు జీతాలను ఆఫర్‌ చేస్తున్నా జిల్లాకు వచ్చేందుకు మక్కువ చూపడం లేదు. కరోనా ప్రభావం ఎక్కువుగా ఉండటమే దీనికి కారణం. దీంతో డిసెంబర్‌ నాటికి వంతెన పనులు పూర్తవుతాయా..? అన్న సందేహం నెలకొంది.

Updated Date - 2020-08-10T18:13:49+05:30 IST