ఏటీఎంలలో పెట్టమంటే కాజేశారు

ABN , First Publish Date - 2021-03-04T04:44:28+05:30 IST

ఏటీఎంలలో జమచేయాల్సిన నగదును కాజేసిన సంస్థ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది.

ఏటీఎంలలో పెట్టమంటే కాజేశారు

43.93 లక్షలు కొట్టేసిన ప్రైవేటు కంపెనీ సిబ్బంది

ఆడిట్‌ను తప్పుదోవ పట్టించిన ఉద్యోగులు

రెండో సారి ఆడిట్‌లో గుర్తించిన అధికారులు

జంగారెడ్డిగూడెంటౌన్‌, మార్చి 3 : ఏటీఎంలలో జమచేయాల్సిన నగదును కాజేసిన సంస్థ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది. ఏలూరుకు చెందిన పల్లి వీరవెంకట భాస్కరరావు, బీమా నాగేశ్వరరావు ఏటీఎంలలో నగదు జమ చేసే రైటర్‌ సేఫ్‌ గార్డ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో జమ చేయా ల్సిన రూ. 25 లక్షలు, కేవీబీ బ్యాంకులో జమ చేయాల్సిన రూ. 17.84 లక్షలు, ఇండ్‌ క్యాష్‌ ఏటీఎంలో జమ చేయాల్సిన రూ. 1.09 లక్షల నగదు మొత్తంగా 43.93 లక్షలు  కాజేశారు. లాక్‌ డౌన్‌ సమయంలో నేరుగా ఆడిట్‌ నిర్వహించే అవకాశం లేకపోవ డంతో ఆన్‌లైన్‌ ద్వారా ఆడిట్‌ నిర్వహించారు. ఆ ఆడిట్‌లో నెంబర్లు మాయాజాలం చేసి తప్పుడు లెక్కలు చూపించారు. అయితే ఇటీవల ముంబయి నుంచి వచ్చిన  అధికారులు ఆడిట్‌ నిర్వహించి రూ.43.93 లక్షలు మాయమైనట్టు గుర్తించారు. ఇదేవిషయం సిబ్బందిని అడగ్గా పొంతనలేని సమాధానం చెప్పారు. కంపెనీ ఉద్యోగులైన పల్లి వీరవెంకట భాస్కరరావు, బీమా నాగేశ్వరరావు కాజేసినట్టుగా ఆడిట్‌ అధికారులు గుర్తించారు. జిల్లా రూట్‌ ఇన్‌చార్జి గాదె రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కుటుంబరావు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-04T04:44:28+05:30 IST