‘కిట్ల’ కిరికిరి
ABN , First Publish Date - 2021-06-24T04:57:25+05:30 IST
నేపథ్యంలో ఏలూరుకు సమీపంలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ వైద్యాధికారి పాత్రపై బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
కొవిడ్ టెస్టులు చేయకుండానే కిట్లను పక్కదారి మళ్లిస్తున్న ఓ వైద్యాధికారి
మెడికల్ ఆఫీసర్ వేధింపులపై జిల్లా పాలనా అధికారికి స్టాఫ్నర్సు ఫిర్యాదు
అక్రమాలకు డీఎంహెచ్వో కార్యాలయంలో మరో అధికారి సహకారం
ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 23 : కరోనా టెస్టుల కిట్లు పక్కదారి పడుతు న్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏలూరుకు సమీపంలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ వైద్యాధికారి పాత్రపై బాహాటంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్పై కీలక విధులు నిర్వర్తిస్తోన్న మరో వైద్యాధికారి సహకారంతోనే పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ అక్రమ మార్గాల్లో రాపిడ్ యాంటీజెన్ కిట్ (ఆర్ఏటీ)లను తరలిస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు కొంతకాలంగా పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను వేధింపులకు గురిచేస్తుండడంతో వాటికి తాళలేక స్టాఫ్ నర్సు ఒకరు బుధవారం నేరుగా ఉద్యోగ సంఘ జిల్లా నాయకునితో కలిసి జిల్లా పాలనా అధికారికి ఫిర్యాదు చేయగా, వైద్యాధికారి తీరుకు నిరసనగా పలువురు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన ప్రదర్శనలు నిర్వహించడం గమనార్హం.
కొవిడ్ టెస్ట్ కిట్ల మళ్లింపు ఇలా..
కొవిడ్ టెస్టు చేయించుకోవాలంటే పీహెచ్సీకి రావాల్సి ఉంటుంది. టెస్ట్ చేయించుకునే వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ వివరాలను ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాలి. ఇలా వివరాలు నమోదు తర్వాత టెస్ట్ అనంతరం ఫలితాన్ని వెంటనే వెల్లడించే వెసులుబాటు ర్యాపిడ్ కిట్లతో ఉంటుంది. ఈ టెస్ట్ ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంకాగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో గరిష్టంగా రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పీహెచ్సీ పరిధిలోని గ్రామాల ప్రజల డేటాను ఎంఎల్పీ హెచ్పీల నుంచి తీసుకుని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తోన్న వ్యక్తుల పేర్లు, వారి వివరాలను, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ ఎంల ఫోన్ నెంబర్లను పోర్టల్లో నమోదు చేసి ర్యాపిడ్ కిట్లను సంబంధిత వైద్యాధికారి దారి మళ్లిస్తున్నట్టు సమాచారం. ఈ తతంగంపై అనుమానం వచ్చి న వైద్య సిబ్బంది స్థానిక ఆశా వర్కర్లను ఆయా గ్రామాలకు పంపి వాకబు చేయించగా తాము కొవిడ్ టెస్ట్కు అసలు రానేలేదని తేల్చిచెప్పడంతో అక్రమా లు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్ టెస్ట్ ఫలితం మాత్రం ఏఎన్ఎంల ఫోన్ నెంబర్కు వెళ్తుండడంతో, టెస్టు చేయించుకున్న వ్యక్తులు పొరపాటున తమ నెంబరు ఇచ్చి ఉంటారని ఊరకుండిపోతున్నారు. ఏఎన్ఎంల ఫోన్ నెంబ ర్లకు టెస్ట్ ఫలితం నెగిటివ్ అని పంపిస్తుండడంతో దీనిపై ఎవరూ పట్టించు కోవడం లేదు. ఇలా కొవిడ్ టెస్ట్లు(ఆర్ఏటీ) చేయకుండానే తప్పుడు వివరాలను నమో దు చేసి కిట్లను పక్కదారి మళ్లిస్తున్న పీహెచ్సీ సిబ్బందే ఆరోపిస్తుండడం గమనార్హం.
వేధింపులు భరించలేక నిరసన
గతేడాది కొవిడ్ ఉధృతి సమయంలో ఏడాది కాలానికి డిప్యూటేషన్పై పీహెచ్సీకి వచ్చిన వైద్యాధికారి అప్పటికే అక్కడ పనిచేస్తోన్న రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ అధికారి అండదండలను చూసుకుని జులుం ప్రదర్శించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక పీహెచ్సీలో పనిచేస్తున్న సిబ్బందిని తీవ్ర వేధింపులకు గురిచేస్తుండడంతో తొలుత డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యా ధికారికి సహకరించే మరో వైద్యాధికారి ఉండడంతో ఎటువంటి చర్యలు లేవని గమనించి బుధవారం ఓ ఉద్యోగ సంఘ నాయకుడి సహకారంతో జిల్లా పాలనా అధికారికి స్టాఫ్ నర్సు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మండలంలోని పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యాధికారికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొవిడ్ టెస్ట్ కిట్ల దారి మళ్లింపుపై స్వయంగా సిబ్బందే వెలుగులోకి తీసుకురావడంతో అప్రమత్తమైన సంబంధిత వైద్యాధికారి దిద్దుబాటు చర్యలను చేపట్టారు. నేరుగా సిబ్బందిని పిలిపించుకుని బుజ్జగిం చడం ప్రారంభించారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. మరోవైపు మండలంలో తనకు అనుకూలురైన స్థానికుల సహాయంతో ఎటువంటి విచారణలు ఎదురైనా స్పందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుం టున్నారు. కొంతకాలంగా నిర్వహిస్తోన్న కొవిడ్ టీకా మందు సరఫరాలో కూడా ఆ వైద్యాధికారి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా అనర్హులకు పంపిణీ చేసినట్టు సిబ్బంది ఆరోపిస్తుండడం గమనార్హం.
వైద్యాధికారిణి వేధింపులపై సిబ్బంది నిరసన
పెదపాడు, జూన్ 23 : వైద్యాధికారిణి వేధింపుల నుంచి రక్షణ కల్పించా లంటూ పెదపాడు పీహెచ్సీ పరిధిలోని సబ్సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న పలువురు స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఆయా సబ్సెంటర్లలో బుధ వారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన తెలిపారు. పెదపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రెగ్యులర్గా ఇద్దరు వైద్యులు విధులు నిర్వహించా ల్సి ఉండగా ప్రస్తుతం వైద్యాధికారిణి పూజ ఒక్కరే కొంతకాలంగా డిప్యూటేషన్ మీద విధులు నిర్వహిస్తున్నారని వైద్యసిబ్బంది ఆరోపిస్తున్నారు. వైద్యసిబ్బందికి అధిక సమయం డ్యూటీల కేటాయింపు, అవసరమైన వేళ సెలవులు మంజూ రు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, ఇందుకు పీహెచ్ఎన్ సహకరి స్తున్నారని వసంతవాడకు చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. కొందరు వైద్య ఉన్నతాధికారుల అండదండలతోనే కింది సిబ్బందిని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటు వంటి చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు. కొవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న తమకు మరోవిధంగా ఎదురవుతున్న వేధింపుల నుంచి కాపాడాలంటూ, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, రెగ్యులర్ గా ఉండే వైద్యులకు ఇక్కడ విధులు కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తు న్నారు. అలాగే ఆర్ఏటీ కిట్లు, కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీలో కొన్ని అవకతవకలు జరిగినట్టు వైద్యసిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లినట్టు తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేస్తున్నాం..
కొవిడ్ను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వైద్య సిబ్బందికి సెలవులు మంజూరు చేశాం. వ్యాక్సిన్, కిట్ల విషయంలో ఎటు వంటి అవకతవకలు జరగలేదు. శ్వాబ్ టెస్ట్లు, కొవిడ్ బాధితుల ఆరోగ్యంపై వాకబు తదితర రిపోర్టులను ఎప్పటికప్పుడూ అందించాల్సిందిగా సిబ్బం దిని ఆదేశించాం. దీనిని పని ఒత్తిడిగా భావించి నాపై ఆరోపణలు చేస్తున్నారు.
– పూజ, వైద్యాధికారిణి, పెదపాడు