కేసుల్లో రికార్డు
ABN , First Publish Date - 2021-05-17T06:14:16+05:30 IST
ఇక సంపూర్ణ లాక్డౌన్తోనే కట్టడి సాధ్యమా ?జిల్లాలో కరోనా కేసులు విశ్వరూపం చూపిస్తున్నాయి.
పాజిటివిటీ రేటు 30 శాతం
ఒక్క రోజులో 2,426 మందికి పాజిటివ్
కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నా పెరుగుతున్న కేసులు
సెకండ్ వేవ్లో అత్యధికంగా నమోదు
ఏలూరు ఎడ్యుకేషన్, మే 16 : ఇక సంపూర్ణ లాక్డౌన్తోనే కట్టడి సాధ్యమా ?జిల్లాలో కరోనా కేసులు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 21 వేల 424 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే అత్యధి కంగా 2426 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ఈనెల ఐదో తేదీ నుంచి 18 గంటలపాటు కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారులు, పోలీసులు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఉధృతి తగ్గకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి ఉంది.
తొలుత రాత్రి కర్ఫ్యూ.. ఆ తరువాత పగటి కర్ఫ్యూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అంతా బంద్. రెండు వారాలకుపైగా కర్ఫ్యూ నిబంధనలు, ప్రజల కదలికలపై ఆంక్షలు అమలవుతున్నా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఎక్కడా తగ్గు ముఖం పట్టడంలేదు. కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో జిల్లాలో కొవిడ్ పాజిటివిటీ రేటు 25 శాతం ఉండగా, ఆంక్షలు, షరతులు, నిషేధాలు కఠినంగా పాటిస్తున్న ప్రస్తుత రోజుల్లో పాజిటివిటి రేటు తగ్గాల్సింది పోయి ఏకంగా 30 శాతానికి పెరగడం కలవరం పుట్టిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎపిడిమియాలజి(వైరస్ సంబంధిత జబ్బుల విభాగం) తాజా విశ్లేషణలు, గణాంకాల ప్రకారం జిల్లాలో కరోనా పాజిటివిటి రేటు 30 శాతానికి చేరినట్టు ధృవపడింది. ఆ ప్రకారం కొవిడ్ టెస్ట్లు జరుగుతున్న ప్రతీ వంద మందిలో 30 మందికి పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. కర్ఫ్యూ ఆంక్షల్లోనూ జిల్లాలో ఎక్కడా పాజిటివ్ వ్యాప్తి తగ్గుముఖం పడిన దాఖలాలు లేవని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా పాజిటివ్ నిర్ధారణ అవుతున్న వారిలో అత్యధికులు 30–50 ఏళ్ల వయసు గ్రూపునకు చెందిన వారేనని గుర్తించారు. ఇక మృతులు సైతం ఇదే వయస్సుకు చెందిన వారే ఎక్కువగా ఉండగా, కరోనా పట్ల భయాందోళనల వల్లే మృత్యుపాలవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోందని ఎపిడిమియాలజీ విభాగం గుర్తించింది. ఇక పూర్తి సంపూర్ణ లాక్డౌన్తోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఒక్క రోజే 2426 పాజిటివ్ కేసులు
జిల్లాలో ఇంతకు ముందు రోజువారి నమోదవుతున్న పాజిటివ్ కేసులను బ్రేక్ చేస్తూ ఆదివారం ఒక్కరోజే 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ఆసుపత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 13 వేల 007కి పెరిగింది. ఆదివారం కోవిడ్ తీవ్రతకు ముగ్గురు బలయ్యారు. కొత్తగా 30 చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. తాజా పాజిటివ్ కేసుల్లో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం టాప్ స్థానాల్లో ఉన్నాయి. వీటితోపా టు జంగారెడ్డిగూడెం, గణపవరం, చింతలపూడి, అత్తిలి, ఆకివీడు, భీమడో లు, ఆచంట, చాగల్లు, దేవరపల్లి, గణపవరం, ఇరగవరం, గోపాలపురం, జీలుగుమిల్లి, కుక్కునూరు, మొగల్తూరు, లింగపాలెం, నరసాపురం, నిడద వోలు, పాలకొల్లు, పాలకోడేరు, పెనుగొండ, పెదవేగి, తాళ్ళపూడి, ఉండ్రాజ వరం మండలాల్లో రెండంకెల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు
ఏలూరు క్రైం, మే 16 : కరోనా మృతులకు అంత్యక్రియల ఖర్చుల నిమి త్తం రూ.15 వేలు అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్కుమార్ సింఘాల్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నిర్ధారణ అయి మృతి చెందిన కుటుంబా లకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయలను ప్రతి మృతుని కుటుంబానికి అందించాలని కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి.
కొవిషీల్డ్ నిల్వలు 58 వేల డోసులు
రెండో డోసు వేయాల్సింది 2,500 మందికే
తొలి డోసు పంపిణీకి అనుమతిస్తేనే నిల్వల వినియోగానికి అవకాశం
ఏలూరు ఎడ్యుకేషన్, మే 16 : విద్యుత్, పశు సంవర్ధక శాఖ, బ్యాంకు ఉద్యోగులకు ఆదివారం ఏలూరు, భీమవరం, తణుకులలో వ్యాక్సినేషన్ జరిగింది. కోవాగ్జిన్ నిల్వలున్న చోట రెండో డోసు పంపిణీని సోమవారం నిర్వహించనున్నారు. తణుకు, భీమవరం, ఏలూరు డిపోల పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులకు సోమ, మంగళవారాల్లో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ను చేపట్టనున్నారు.జిల్లాకు దిగుమతైన 40 వేల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ నిల్వలను ఆదివారం సీవీసీలకు పంపిణీ చేసినప్పటికీ, లబ్ధిదారు లకు సరఫరాపై ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో కోవిషీల్డ్ రెండో డోసు లబ్ధిదారులు కేవలం రెండు వేల 500 మంది మాత్రమే ఉండగా, నిల్వలు మాత్రం తాజాగా అందిన డోసులతో కలిపి 58 వేలు ఉన్నాయి. ప్రభుత్వం ఇంతకు ముందు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకా రం ఈ నెలాఖరు వరకు రెండో డోసు వారికి మాత్రమే టీకా మందు సర ఫరా జరగాల్సి ఉంది. మరోవైపు కోవిషీల్డ్ తొలి డోసు, రెండో డోసుకు మధ్య అంతరాన్ని 42 నుంచి 84 రోజులకు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకు ప్రస్తుతం జిల్లాలోని 60 వేల డోసుల కోవిషీల్డ్ వినియోగంపై డైలమా నెలకొంది. కోవి షీల్డ్ రెండో డోసు పంపిణీకి వ్యవధిని 84 రోజులకు పెంచిన నేపథ్యంలో దానికి అను గుణంగా కోవిన్ సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. ఆ ప్రకారం కోవి షీల్డ్ తొలి డోసు తీసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు 84 రోజు ల వ్యవధి పూర్తయితేనేగాని కోవిన్ సాఫ్ట్వేర్లో నమోదు చేయడానికి సాధ్యం కాదు. ఇక తొలి డోసు వ్యాక్సిన్ కోసం జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులు భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నందున ఆ మేరకు ప్రభుత్వం తొలి డోసు టీకా మందు పంపిణీకి అనుమతిస్తేనే గాని ఇప్పుడున్న వ్యాక్సిన్ నిల్వలు వినియోగం అయ్యేందుకు అవకాశాలు లేవు.
ముందుకొచ్చిన ‘ఫ్రెండ్స్’
చింతలపూడి, మే 16: భట్టువారి గూడెంకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో ఫ్రెండ్స్ ఆర్గనైజే షన్ సభ్యులు ఆదివారం అంత్యక్రి యలు నిర్వహించారు. మృతుని కుటుంబీకులు వారిని ఆశ్రయించ డంతో స్థానిక సిటీ మెడికల్స్ యాజ మాన్యం పీపీ కిట్లను ఉచితంగా అందజేయడంతో వాటిని ధరించి మృతుని తోటలోనే అంత్యక్రియలు నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు ఆదిగురు శ్రీనివాస్, అనంతోయ్ చందును స్థానికులు అభినందించారు.